వర్షానికి నేలకొరిగిన అరటి
ABN , First Publish Date - 2021-10-07T06:21:36+05:30 IST
మండలంలో మంగళవారం సాయంత్రం భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి బొమ్మక్కపల్లి గ్రామం వద్ద గల అరటితోట ధ్వంసమైంది.
రాయదుర్గంరూరల్,అక్టోబరు 6: మండలంలో మంగళవారం సాయంత్రం భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి బొమ్మక్కపల్లి గ్రామం వద్ద గల అరటితోట ధ్వంసమైంది. మండలంలో 3.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు డిప్యూటీ తహసీల్దార్ సూర్యప్రతాప్ తెలిపారు. భారీ ఈదురుగాలులు రావడంతో బొమ్మక్కపల్లి గ్రామానికి చెందిన జనార్దన, ఆయన కుమారుడు జగదీష్ సాగు చేసిన అరటితోటలో 3500 మొక్కలు నేలకొరగడంతో తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో హార్టికల్చర్ అధికారి దస్తగిరి బుధవారం నష్టపోయిన అరటిపంటను పరిశీలించారు. దాదాపు రూ. 4 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. నివేదికలను ఉన్నతాధికారులకు పంపి రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు.