రాబోయే రోజుల్లో జనసేనానే సీఎం
ABN , First Publish Date - 2021-03-30T07:58:53+05:30 IST
రాబోయే రోజుల్లో పవన్ కల్యాణ్ సీఎం అవుతారని.. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు
వచ్చేవారం తిరుపతిలో పవన్కల్యాణ్ రోడ్ షో
జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్
తిరుపతి(జీవకోన) మార్చి 29: రాబోయే రోజుల్లో పవన్ కల్యాణ్ సీఎం అవుతారని.. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తిరుపతిలో సోమవారం జరిగిన జనసేన క్రియాశీలక సభ్యుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్ను బీజేపీ అధిష్ఠానం ప్రకటించడం శుభపరిణామమన్నారు. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్వయంగా చెప్పారన్నారు. వైసీపీ అరాచకపాలనను ఎండగట్టాలంటే తిరుపతిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి రత్నప్రభను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా తమ పార్టీ అధ్యక్షుడు పవన్కళ్యాణ్ వచ్చే వారంలో తిరుపతిలో రోడ్షోతో పాటు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో జగన్రెడ్డి పాలన వచ్చాక సామాన్యుడు జీవించడమే కష్టంగా మారిందన్నారు. పేదలకు తిండి దొరకని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా వైసీపీ దౌర్జన్యాలతో గెలుపును సొంతం చేసుకుంటోందని ఆరోపించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్నిచోట్లా తమ అభ్యర్థులను నిలబెట్టి జనసేన సత్తా చూపుతామని స్పష్టం చేశారు. అనంతరం తిరుపతి నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న సుమారు 2500మందికి సభ్యత్వ కిట్లను ఆయన పంపిణీ చేశారు. పీఏసీ సభ్యులు పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఇన్చార్జి కిరణ్రాయల్, నగర అధ్యక్షుడు రాజారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.