అమరరాజా సంస్థపై కక్ష సాధింపు తగదు : టీడీపీ
ABN , First Publish Date - 2021-05-03T04:14:28+05:30 IST
అమర రాజా సంస్థపై అధికార పక్షం కక్ష సాధింపు తగదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తినాని, ఎమ్మెల్సీలు గౌనివారి శ్రీనివాసులు, బీఎన్ రాజసింహులు, నాయకులు సురేంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
చిత్తూరు (సెంట్రల్), మే 2: అమర రాజా సంస్థపై అధికార పక్షం కక్ష సాధింపు తగదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తినాని, ఎమ్మెల్సీలు గౌనివారి శ్రీనివాసులు, బీఎన్ రాజసింహులు, నాయకులు సురేంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంస్థలోని వాటా దారుల ప్రయోజనాలే ప్రథమ కర్తవ్యంగా గత 35 ఏళ్ళుగా పనిచేస్తూ అమర రాజా సంస్థ అంతర్జాతీయ ఖ్యాతి గడించిందన్నారు. ఈ సంస్థలకు చెందిన గల్లా అరుణకుమారి, గల్లా జయదేవ్ తెలుగుదేశంలో క్రియాశీలకంగా వ్యవహరించడమే కాక, గల్లా జయదేవ్ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై లోక్ సభలో ఎండగట్టడం, అమరావతి ఉద్యమానికి సహకరించడాన్ని జీర్ణించుకోలేని అధికార పార్టీ సంస్థ ఆర్థిక మూలాలు దెబ్బతీయడం సరికాదన్నారు. ఏపీ కాలుష్య నియంత్రణ మండలిపై ఒత్తిడి తెచ్చి జిల్లాలోని కరకంబాడి, నూనె గుండ్లపల్లెలో స్థాపించిన అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ను మూసి వేయాలని ఏప్రిల్ 30న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ క్రమంలో మండలి ఆదేశాలపై కరెంటు నిలిపి వేయడం సరికాదన్నారు. పరిశ్రమ మూతబడితే ప్రత్యక్షంగా 20 వేల మంది, పరోక్షంగా 80 వేల మంది ఉపాధి కొల్పోయి రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్న పరిశ్రమలు తరలిపోయే ప్రమాదం ఉందని టీడీపీ నాయకులు గుర్తు చేశారు.