తొలి విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
ABN , First Publish Date - 2021-02-08T05:33:33+05:30 IST
తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయినట్లు జిల్లా పంచాయతీ అధికారి, డిప్యూటీ ఎన్నికల అథారిటీ అధికారి నాగేశ్వరనాయక్ చెప్పారు.
కాకినాడ,ఆంధ్రజ్యోతి: తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయినట్లు జిల్లా పంచాయతీ అధికారి, డిప్యూటీ ఎన్నికల అథారిటీ అధికారి నాగేశ్వరనాయక్ చెప్పారు. 9న ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందని, మధ్నాహ్నం 3.30 గంటలకు ముగుస్తుందని చెప్పారు. కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్లలో 20 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు.. నిబంధనల మేరకు నిర్దిష్ట సమయానికి ముందే అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిలిపివేయాలని ఆదేశాలిచ్చామని చెప్పారు. మరిన్ని విషయాలను ‘ఆంధ్రజ్యోతి’తో ఆదివారం ఆయన పంచుకున్నారు. కాకినాడ రెవెన్యూ డివిజన్లో 8 మండలాలు. 144 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఈ డివిజన్లో 1688 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పెద్దాపురం డివిజన్లో 12 మండలాల్లో 226 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, 2514 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సుమారు 14 వేల మంది విధుల్లో ఉంటారన్నారు. కాకినాడ డివిజన్లో అతి సమస్యాత్మక ప్రాంతాలు 101, సమస్యాత్మక ప్రాంతాలు 125, పెద్దాపురం డివిజన్లో 149 అతి సమస్యాత్మక , 152 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు చెప్పారు.