ఎస్సీల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా...?
ABN , First Publish Date - 2021-08-11T04:21:31+05:30 IST
రాష్ట్రంలో ఎవరి హయాంలో దళితుల అభివృద్ధి జరిగిందో చర్చకు సిద్ధమా..? అని మాజీమంత్రి, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు వైసీపీ నేతలకు సవాలు విసిరారు.
మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
గుంటూరు, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎవరి హయాంలో దళితుల అభివృద్ధి జరిగిందో చర్చకు సిద్ధమా..? అని మాజీమంత్రి, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు వైసీపీ నేతలకు సవాలు విసిరారు. విజయవాడలో మంగళవారం టీడీపీ ఎస్సీసెల్ నేతలు తలపెట్టిన దళిత ప్రతిఘటన ర్యాలీకి బయలుదేరిన ఆనంద్బాబును గుంటూరులోని నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై ఆనందబాబు మండిపడ్డారు. ర్యాలీకి పోలీసులు అనుమతివ్వకపోవడం అప్రజాస్వామికమన్నారు. రెండేళ్ల వైసీపీ పాలనలో ఎస్సీలపైనే ఎక్కువగా దాడులు జరిగాయని తెలిపారు. ఇది చాలదన్నట్లు ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు దారిమళ్లిస్తున్నారని, దళితులపైనే అట్రాసిటీ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగం దళితులకు కల్పించిన హక్కులను సీఎం జగన కాలరాస్తున్నాడని విమర్శించారు.