క్రీడలతో పోలీసులకు ఆటవిడుపు
ABN , First Publish Date - 2021-12-29T05:16:26+05:30 IST
నిత్యం ఒత్తిళ్ల మధ్య పోలీసులు విధులు నిర్వహించటం ఓ సవాల్ లాంటిదని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు.
హోంమంత్రి మేకతోటి సుచరిత
రూరల్ జిల్లా పోలీసు స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
గుంటూరు, డిసెంబరు 28: నిత్యం ఒత్తిళ్ల మధ్య పోలీసులు విధులు నిర్వహించటం ఓ సవాల్ లాంటిదని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. మంగళవారం పోలీసు పరేడ్ గ్రౌండ్లో రూరల్ జిల్లా పోలీసు స్పోర్ట్స్ మీట్ను ఆమె జ్యోతి వెలిగించి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలు, కరోనా సమయంలో పోలీసులు సమర్ధంగా పనిచేశారన్నారు. అటువంటి ఒత్తిళ్ల మధ్య పనిచేసే పోలీసులకు స్పోర్ట్స్ మీట్ ఆటవిడుపు వంటిదన్నారు. శారీరక, మానసిక ఉల్లాసానికి ఈ క్రీడలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. జడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా మాట్లాడుతూ పోలీసులు ప్రతిభ చూపి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. రూరల్ ఎస్పీ విశాల్గున్నీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని సబ్డివిజన్ల నుంచి పోలీసు అధికారులు, సిబ్బంది ఈ పోటీల్లో పాల్గొంటున్నారన్నారు. రూరల్ జిల్లా పోలీసు క్రీడాకారులు ప్రతిభ చూపి రాష్ట్రస్థాయిలో సత్తా చాటుతారనే నమ్మకం ఉందన్నారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్పీ నేతృత్వంలోని కబడ్డీ జట్టు, అదనపు ఎస్పీ రిషాంత్రెడ్డి టీమ్తో తలపడింది. మూడురోజులపాటు స్పోర్ట్స్ మీట్ జరగనుంది. ఈ కార్యక్రమంలో క్రైం ఎస్పీ ఎన్వీఎస్ మూర్తి, బిందుమాధవ్, ఏఆర్ అదనపు ఎస్పీ రాజు, ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణ, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏవీకే సుజాత వ్యాఖ్యాతగా వ్యవహరించారు.