‘కోటిరెడ్డి’ తపాలా స్టాంప్ ఆవిష్కరణ
ABN , First Publish Date - 2021-10-14T06:00:35+05:30 IST
స్వాతంత్య్ర సమరవీరుల సంస్మరణలో భాగంగా జిల్లా తపాలాశాఖ ఆధ్వర్యంలో కడప కోటిరెడ్డి ముఖచిత్రంతో కూడిన ప్రత్యేక పోస్టల్ స్టాంప్ను ఆవిష్కరించారు.
కడప(మారుతీనగర్), అక్టోబరు 13: స్వాతంత్య్ర సమరవీరుల సంస్మరణలో భాగంగా జిల్లా తపాలాశాఖ ఆధ్వర్యంలో కడప కోటిరెడ్డి ముఖచిత్రంతో కూడిన ప్రత్యేక పోస్టల్ స్టాంప్ను ఆవిష్కరించారు. దేశవ్యాప్త ఆజాదీకా అమృత్మహోత్సవ్లో భాగంగా బుధవారం కడప నగరంలోని తపాలాశాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కడప కోటిరెడ్డి కుటుంబసభ్యులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పోస్టల్ సూపరింటెండెంట్ గౌస్ ఆజం మాట్లాడుతూ సామాన్య రైతు కుటుంబంలో 1886వ సంవత్సరంలో జన్మించిన కడప కోటిరెడ్డి ఉన్నత న్యాయవాద వృత్తిని లండన్లో పూర్తిచేశారన్నారు. బాపూజి పిలుపు మేరకు స్వాతంత్య్రసమరంలో పాల్గొన్నారన్నారు. స్వాతంత్ర్యానంతరం రాజకీయనేతగా, దాతగా జిల్లా చరిత్రలో మరపురాని వ్యక్తిగా శాశ్వత స్థానం పొందారన్నారు. అలాంటి గొప్పవ్యక్తి పేరుతో తపాలా స్టాంప్ను విడుదల చేయడం తన అదృష్టమన్నారు. కార్యక్రమంలో కడప కోటిరెడ్డి మునిమనుమరాలు రమ్యస్మిత, ఐపీపీబీ మేనేజర్ విష్ణువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.