చల్లగా చూడమ్మా... మారెమ్మ
ABN , First Publish Date - 2021-05-03T04:58:16+05:30 IST
నగర సమీపంలోని ఆలంఖాన్పల్లెలో మారెమ్మతల్లి జాతర మహోత్సవాలు ఆలయ కమిటీ సభ్యుడు ఆర్.జయరామిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరిగాయి.
కొవిడ్ నిబంధనల మేరకు జాతర
కడప(మారుతీనగర్), మే 2: నగర సమీపంలోని ఆలంఖాన్పల్లెలో మారెమ్మతల్లి జాతర మహోత్సవాలు ఆలయ కమిటీ సభ్యుడు ఆర్.జయరామిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరిగాయి. ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకొని జాతర ఉత్సవాలకు మూడు, నాలుగు రోజుల ముందే గ్రామంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండేలా ఆటోల ద్వారా ప్రచారం నిర్వహించారు. దీంతో అమ్మవారిని దర్శించుకునే ప్రతి భక్తుడు మాస్క్ ధరించడంతో పాటు భౌతికదూరం పాటించేలా ఆలయం వద్ద కమిటీ సభ్యుల ద్వారా సూచనలందించారు. ఏదేమైనా ఇలాంటి విపత్కర పరిస్థితులు ఇకముందు రాకూడదని, వచ్చే ఏడాదైనా అమ్మవారి జాతర మహోత్సవాలను గ్రామ ప్రజలు ఆనందకర వాతావరణంలో జరుపుకునేలా చేయాలని నిండు మనస్సుతో నిండుకుండ బోణాలను సమర్పించి మహిళా భక్తులు అభ్యర్థించారు. కోరిన కోర్కెలు నెరవేరడంతో కొందరు అమ్మవారి ఎదుట జంతుబలులు గావించారు. కరోనా లేని సమయంలో గ్రామంలో జాతర అంబరాన్ని అంటేలా జరిగేది. బంధువులు, ఆడబిడ్డల రాకతో గ్రామంలోని ప్రతి ఇల్లు ఎంతో సందడిగా కనిపించేది. ప్రస్తుతం ఆ వాతావరణం కనిపించలేదు. కాగా గ్రామ టీడీపీ నేత మన్మోహన్రెడ్డి, 49వ డివిజన్ కార్పొరేటర్ ఉమాదేవి, మునికుమార్రెడ్డిలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.