దేవగుడి కాలువలో జంబు తొలగించండి
ABN , First Publish Date - 2021-11-03T05:18:01+05:30 IST
దేవగుడి బ్రాంచ్ కెనాల్ కాలువలో పేరుకున్న జంబును తొలగించి ఆయకట్టు కు పూర్తి స్థాయిలో సాగునీరందించాలని ఆయకట్టు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
జమ్మలమడుగు రూరల్, నవంబరు 2 : దేవగుడి బ్రాంచ్ కెనాల్ కాలువలో పేరుకున్న జంబును తొలగించి ఆయకట్టు కు పూర్తి స్థాయిలో సాగునీరందించాలని ఆయకట్టు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. జమ్మలమడుగులోని నాగులకట్ట రైల్వేస్టేషన్ శివార్ల నుంచి ప్రభుత్వ బాలుర వసతి గృహం, మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి దేవగుడి బ్రాంచ్ కెనాల్ ప్రవహిస్తుంది. అయితే ఈ కాలువ వరకు పేరుకున్న జంబు, వ్యర్థాలను తొలగించకపోవడంతో నీటి ప్రవాహం పూర్తిస్థాయి లో ఉండక సాగునీటికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు దేవగుడి కెనాల్కు నీరు వచ్చినప్పటికి జంబు పేరుకోవడం వలన కొన్ని చోట్ల నీటి ప్రవాహం నిలిచి పోయింది. కాగా ప్రస్తుతం కాలువ వెంబడి చెత్తాచెదారం, మృతిచెందిన జంతు కబేళాలను పడవేయడం వలన దుర్గంధభరితంగా మారిందని వారు వాపోతున్నారు. సంబందిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే జమ్మలమడుగు పట్టణంలో కాలువపై కొందరు ఆక్రమణలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకుని కాలువలోని జంబును, వ్యర్థాలను తొలగిం చాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.