వైద్యులు, అధికారులు అప్రమత్తం కావాలి
ABN , First Publish Date - 2021-08-20T05:55:34+05:30 IST
కరోనా మూడో దశను సమర్థంగా ఎదుర్కొనేందుకు వైద్యులు, అధికారులు అప్రమత్తం కావాలని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సూచించారు.
సమీక్ష సమావేశంలో మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం టౌన్, ఆగస్టు 19 : కరోనా మూడో దశను సమర్థంగా ఎదుర్కొనేందుకు వైద్యులు, అధికారులు అప్రమత్తం కావాలని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సూచించారు. జిల్లా పరిషత్ సమావేశపు హాలులో వైద్యులు, పోలీసు ఉన్నతాధికారులు, నగరపాలక సంస్థ అధికారులతో మంత్రి పేర్ని నాని గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మొదటి, రెండో దశల్లో ఎదుర్కొన్న అనుభవాల దృష్ట్యా ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సన్ట్రేటర్లు, పడకలను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతిరోజూ ఫీవర్ సర్వే కొనసాగించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఉన్నాయన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి కరోనా లక్షణాలతో వస్తే 15 నిముషాల వ్యవధిలో అడ్మి ట్ చేసి వైద్యం ప్రారంభించాలన్నారు. వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించవద్దని వైద్యులకు సూచించారు. ఈ సమావేశంలో మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, ఆర్డీవో ఖాజావలి, కమిషనర్ ఎస్.శివరామకృష్ణ, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జయకుమార్, డీసీహెచ్ జ్యోతిరమ్మయి, ఆర్ఎంవో డాక్టర్ మల్లికార్జునరావు, డాక్టర్ అల్లాడ శ్రీనివాసరావు, డాక్టర్ తేజస్విని, డాక్టర్ లలిత తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పేర్ని నానీకి వినతులు
తెల్లరేషన్ కార్డులు తొలగించారంటూ మంత్రి పేర్ని నానీకి వివిధ ప్రాంతాల బాధితులు వినతి పత్రాలు సమర్పించారు. మంత్రి తన కార్యాలయం వద్ద గురువారం ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. కరగ్రహారం శివారు పల్లెపాలెం వాసి బలగం పాండురంగారావు తన తెల్లరేషన్ కార్డు రద్దు చేశారని ఫిర్యాదు చేశాడు. రేషన్ పొందేందుకు ఈకేవైసీ చేయించుకోవాలని మంత్రి సూచించారు. ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను మంత్రికి వివరించారు.