బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2021-08-27T06:19:10+05:30 IST
బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన అజిత్సింగ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం వెలుగు చూసింది.
బిడ్డను కాపాడాలంటూ ఫోన్లో సందేశం
నిమిషాల్లో వెళ్లి తల్లీ, కుమార్తెను కాపాడిన పోలీసులు
అజిత్సింగ్నగర్, ఆగస్టు 26: బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన అజిత్సింగ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం వెలుగు చూసింది. తన బిడ్డను కాపాడాలని, ప్రేమ పేరుతో తనను మోసం చేసిన అఖిల్పై చర్యలు తీసుకోవాలని, తాను ఆత్మహత్య చేసుకుంటానని బ్యాంకు ఉద్యోగి దిశ యాప్కు సందేశం పంపింది. నిమిషాల్లో అప్రమత్తమైన అజిత్సింగ్నగర్ పోలీసులు వెంటనే వెళ్లి తల్లీ, బిడ్డను రక్షించారు. ప్రస్తుతం ఆమె ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా పాప పోలీసుల సంరక్షణలో ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రేమ పేరుతో నమ్మి వచ్చిన తనను అఖిల్ మోసం చేయడంతో సమాజంలో ఎదురయ్యే అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన కుమార్తెను పోలీసులు ఆదుకోవాలని కోరుతూ న్యూరాజరాజేశ్వరిపేట ప్రాంతానికి చెందిన మహిళ దిశ యాప్లో సందేశం పంపింది. దిశ కంట్రోల్రూమ్ సిబ్బంది వెంటనే పోలీసులను అప్రమత్తం చేశారు. వెంటనే స్పందించిన సీఐ లక్ష్మీనారాయణ సిబ్బందితో కలసి బాధితురాలి ఇంటికి వెళ్లారు. అప్పటికే ఆమె విషం సేవించి ఉందని గుర్తించి వెంటనే ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారు. ప్రస్తుతం అఖిల్ కోసం గాలిస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.