రేపటి నుంచి గుణదల తిరునాళ్ల
ABN , First Publish Date - 2021-02-08T06:20:11+05:30 IST
రేపటి నుంచి గుణదల తిరునాళ్ల
గుణదల, ఫిబ్రవరి 7 : గుణదల మేరీమాత తిరునాళ్లకు సర్వంసిద్ధమైంది. ఈ నెల 9, 10, 11 తేదీల్లో ఉత్సవాలు జరుగుతాయని విజయవాడ కతోలిక పీఠం అధిపతి ఫాదర్ తెలగతోటి జోసఫ్ రాజారావు తెలిపారు. గుణదల సోషల్ సర్వీస్ సెంటరులో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. ఉత్సవాలకు వచ్చేవారు రాత్రి బస చేయకుండా తిరిగి వెళ్లిపోవాలని ఇప్పటికే సందేశం పంపామన్నారు. ఇందులో భాగంగానే రాత్రివేళ సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేశామని చెప్పారు. ఉత్సవాలకు వచ్చే భక్తులు మాస్కులు ధరించి రావాలని తెలిపారు. పుణ్యక్షేత్రం ప్రాంగణాన్ని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ బందోబస్తు కొంతమేర తక్కువ ఉన్నందున ప్రైవేట్ సెక్యూరిటీ సాయం కూడా తీసుకుంటున్నామని చెప్పారు. కులమతాలకు అతీతంగా అన్ని రంగాల వారు ఉత్సవాలకు రానున్నారని విజయవాడ మేత్రాసనం మోన్సిగ్ఞోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్ తెలిపారు. రైల్వే, ఆర్టీసీ అధికారులను కలిసి ప్రత్యేక ఏర్పాట్ల విషయమై చర్చించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్సీ డైరెక్టర్ ఫాదర్ థోమస్, పుణ్యక్షేత్రం రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు తదితరులు పాల్గొన్నారు.