ఆస్తి పత్రాలను మాయం చేశారు
ABN , First Publish Date - 2021-08-11T05:04:03+05:30 IST
‘మా ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. బోయిన్పల్లి పోలీసులు అనధికారికంగా చొరబడ్డారు. ఆస్తి పత్రాలు, విలువైన డాక్యుమెంట్లను మాయం చేశారు’
- ఇంట్లో లేని సమయంలో అనధికారిక సోదాలు
- బోయిన్పల్లి పోలీసులపై మాజీ మంత్రి అఖిలప్రియ ఫిర్యాదు
హైదర్నగర్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ‘మా ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. బోయిన్పల్లి పోలీసులు అనధికారికంగా చొరబడ్డారు. ఆస్తి పత్రాలు, విలువైన డాక్యుమెంట్లను మాయం చేశారు’ అంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం స్టేషన్కు వెళ్లి, ఈ మేరకు ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణకు లిఖిత పూర్వక ఫిర్యాదును అందజేశారు. తమపై బోయిన్పల్లిలో నమోదైన కేసు విచారణలో ఉందని ఆమె గుర్తుచేశారు. ఈ కేసుకు సంబంధించి తన భర్త భార్గవ్ జూలై 3న సికింద్రాబాద్ కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా.. కొవిడ్ కారణంగా వెళ్లలేకపోయారన్నారు. ఆ సమాచారాన్ని పోలీసులకూ అందజేశారని వివరించారు. తాను గర్భవతి కావడంతో ఐసోలేషన్లో ఉండాలని నిర్ణయించు కున్నానని, ఈ నేపథ్యంలో జూలై 6న ఆళ్లగడ్డకు వెళ్లినట్లు తెలిపారు. ‘అవకాశం కోసం ఎదురు చూస్తున్న బోయిన్పల్లి పోలీసులు.. నా భర్తకు పరీక్ష నిర్వహించిన ల్యాబ్ టెక్నీషియన్ను పిలిపించి, తప్పుడు రిపోర్టును సృష్టించినట్లు వాంగ్మూలం తీసుకున్నారు. నా భర్తపై మరో కేసు నమోదు చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమ యంలో.. సోదాలంటూ వెళ్లారు. వెంటనే మా అత్తకు, నా లాయర్కు సమాచా రం ఇచ్చాను. వారు కేపీహెచ్పీ పరిధిలోని లోధాబెల్లెజ అపార్ట్మెంట్లోని మా ఫ్లాట్కు చేరుకునేలోపు.. ఓ కిటికీ అద్దం పగిలి ఉన్నట్లు గుర్తించారు. సోదాలు చేయాల్సిన అవసరమేముంది? అనే ప్రశ్నకు బోయిన్పల్లి పోలీసుల నుంచి సమాధానం లేదు. ఈ నెల 1న ఫ్లాట్కు తిరిగి వచ్చి చూడగా.. కార్యా లయం తలుపులు తీసి ఉండడం గమనించాను. అందులో ఆస్తిపత్రాలు, విలు వైన డాక్యుమెంట్లు కనిపించకుండా పోయాయి. బోయిన్పల్లి పోలీసులే వాటిని మాయం చేసి ఉంటారు’ అని ఆ ఫిర్యాదులో అఖిలప్రియ పేర్కొన్నారు.