ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలి: డీఈ
ABN , First Publish Date - 2021-10-08T04:32:44+05:30 IST
జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులు నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించాలని హౌసింగ్ డీఈ వెంకట నారాయణ సూచించారు.
మిడుతూరు, అక్టోబరు 7: జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులు నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించాలని హౌసింగ్ డీఈ వెంకట నారాయణ సూచించారు. గురువారం గ్రామ సచివాలయంలో లబ్ధిదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టా తీసుకున్న ప్రతి లబ్ధిదారు ఈ నెల 20 లోపు నిర్మాణాలు ప్రారంభించాలని అన్నారు. నీటి సౌకర్యం లేనందున పనులు చేపట్టలేదని లబ్ధిదారులు డీఈ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మాధురి మాట్లాడుతూ వారం రోజుల్లో పైపులైను ద్వారా కాలనీకి నీరందిస్తామని చెప్పారు. అనంతరం లబ్ధిదారులు నిర్మిస్తున్న ఇళ్లను డీఈ పరిశీలించారు. కార్యక్ర మంలో తహసీల్దార్ సిరాజుద్దీన్, ఎంపీడీవో జీఎన్ఎస్ రెడ్డి, హౌసింగ్ ఏఈ శ్రీనివాసులు, ఏపీఎం కల్పలత, మార్కెట్ యార్డు చైర్మన్ తువ్వా చిన్న మల్లారెడ్డి, సర్పంచు లక్ష్మీదేవి ఉన్నారు.
పాములపాడు: జగనన్న కాలనీ ఇళ్ల లబ్ధిదారులకు ఎంపీపీ సరోజిని వర్జీనియా, హౌసింగ్ డీఈ ప్రభాకర్, తహసీల్దార్ వేణుగోపాలరావు, ఎంపీడీవో రాణెమ్మ హౌసింగ్ ఏఈ శివరామక్రిష్ణారెడ్డి అవగాహన సదస్సు నిర్వహించారు. గురువారం మండలంలోని మద్దూరు గ్రామంలో సర్పంచ్ అక్తరున్నిసా అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభలో వారు మాట్లాడారు. త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు.