పాములతో కూలీలకు భయం
ABN , First Publish Date - 2021-05-30T06:05:53+05:30 IST
రుద్రవరం మండలంలో 21 గ్రామ పంచాయతీ పరిధిలో 5,448 మంది ఉపాధి కూలీలు పని చేస్తున్నారు.
- ఫస్డ్ ఎయిడ్ కిట్లు కరువు
- పనుల వద్ద సౌకర్యాలు నిల్
రుద్రవరం, మే 29: రుద్రవరం మండలంలో 21 గ్రామ పంచాయతీ పరిధిలో 5,448 మంది ఉపాధి కూలీలు పని చేస్తున్నారు. తెలుగుగంగ ఉప కాలువలు, పంట కాలువలు చెరువు కాలువల్లో పూడికతీత, చెత్త తొలగింపు పనులు చేస్తున్నారు. పని స్థలాల్లో ఎక్కడ చూసినా పాములు, కొండ చిలువలు కనపడుతున్నాయి. దీంతో ఉపాధి కూలీలు హడలిపోతున్నారు. ఈనెల 26వ తేదీన రుద్రవరం గ్రామానికి చెందిన ఇద్దరు కూలీలు ఉపాధి పనుల వద్ద పాముకాటుకు గురైన విషయం విదితమే. అయితే ఉపాధి పనులు చేసే స్థలాల్లో ఫస్ట్ఎయిడ్ బాక్సులు లేవు. దీంతో కూలిపై ఆధారపడి జీవించే పేదలు పాము కరిస్తే సకాలంలో వైద్యం అందక చనిపోవాల్సి వస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2017లో ఫస్ట్ఎయిడ్ బాక్సులు పంపిణీ చేశారు. ఆ తర్వాత తిరిగి పంపిణీ చేయలేదు. అలాగే ఉపాధిహామీ పథకం పనుల వద్ద కనీస సౌకర్యాలు లేవు.
ఫస్ట్ ఎయిడ్ బాక్సులు సరఫరా కాలేదు
ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఈ ఏడాది సరఫరా చేయలేదు. 2017లో మాత్రమే సరఫరా చేశారు. ఈవిషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
- ప్రతాప్, ఏపీవో, రుద్రవరం