మహిళలకు జీవనోపాధి కల్పించాలి: జేసీ
ABN , First Publish Date - 2021-08-22T05:23:11+05:30 IST
ఎస్జీహెచ్ గ్రూపుల మహిళలకు బ్యాంకు లింకేజీ ద్వారా నిధులు ఇప్పించి జీవనోపాధి కల్పించాలని జేసీ (సంక్షేమం) ఎంకేవీ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు.
కర్నూలు(కలెక్టరేట్), ఆగస్టు 21: ఎస్జీహెచ్ గ్రూపుల మహిళలకు బ్యాంకు లింకేజీ ద్వారా నిధులు ఇప్పించి జీవనోపాధి కల్పించాలని జేసీ (సంక్షేమం) ఎంకేవీ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. శనివారం జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తన చాంబర్లో డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు, మెప్మా పీడీ శిరీష, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎల్డీఎం వెంకటనారాయణతో సమీక్ష నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ఎస్జీహెచ్ గ్రూపుల మహిళలు అభివృద్ధి పథం వైపు నడిపించాలని, వారికి క్షేత్ర స్థాయిలో బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు మంజూరు చేయించాలని తెలిపారు. ఎస్జీహెచ్ గ్రూపుల మహిళలకు జగనన్న చేయూత ద్వారా ఎస్జీహెచ్ గ్రూపుల మహిళలకు క్షేత్ర స్థాయిలో సమావేశాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో ఆర్పీలు మహిళల గ్రూపులను తనిఖీలు నిర్వహించి వాస్తవాలను గుర్తించి తక్షణమే బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు ఇప్పించాలన్నారు. జగనన్న గృహాలలో లబ్ధిదారులుగా ఉన్న ఎస్జీహెచ్ గ్రూపుల మహిళలు త్వరితగతిన గృహాలు నిర్మించుకునేలా చూడాలని, క్షేత్ర స్థాయిలో గృహాలు మంజూరైన వారు వెంటనే గృహాలు నిర్మించుకునేలా చైతన్యపరచాలని ఆయన సూచించారు. జగనన్న గృహాలలో లబ్ధిదారులలో దాదాపు 43 శాతం మంది పొదుపు మహిళలు ఉన్నారని, వీరందరూ గృహాలు నిర్మించుకునేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.