పకడ్బందీగా నిర్వహించాలి
ABN , First Publish Date - 2021-05-02T05:43:21+05:30 IST
ఇంటర్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆర్ఐవో సాలాబాయి, డీవీఈవో జమీర్ పాషా సూచించారు.
- పాజిటివ్ విద్యార్థులకు రీ ఎగ్జామ్
- ఇంటర్ పరీక్షలపై ఆర్ఐవో, డీవీఈవో
కర్నూలు(ఎడ్యుకేషన్), మే 1: ఇంటర్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆర్ఐవో సాలాబాయి, డీవీఈవో జమీర్ పాషా సూచించారు. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ టౌన్ మోడల్ కళాశాలలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులకు శనివారం వర్క్షాప్ నిర్వహించారు. జిల్లాకు ఒక కొవిడ్ ప్రత్యేక అధికారిని, ప్రతి పరీక్ష కేంద్రానికి ముగ్గురు ప్రొటోకాల్ ఆఫీసర్స్ని నియమించామని తెలిపారు. విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండాలని, మాస్కులు ధరించేలా చూడాలని ఆదేశించారు. విద్యార్థులే శానిటైజర్లు, వాటర్ బాటిళ్లు తెచ్చుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల మెయిన్గేటు వద్ద విద్యార్థులకు థర్మల్ స్కీనింగ్ టెస్టులు నిర్వహించి లోపలికి అనుమతించాలని సూచించారు. కొవిడ్ లక్షణాలు కనిపిస్తే, వారికి ఐసొలేషన్ గదిలో పరీక్షలు రాయించాలని ఆదేశించారు. పాజిటివ్ అని తేలితే, మరుసటి రోజు నుంచి పరీక్ష రాయనవసరం లేదని విద్యార్థులకు తెలపాలని అన్నారు. పాజిటివ్ వచ్చిన విద్యార్థులకు జూన్, ఆగస్టు నెలలో రీ ఎగ్జామినేషన్ నిర్వహిస్తామని, వారిని రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణిస్తారని తెలిపారు. ఐసొలేషన్ గదిలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి పీపీఈ కిట్లు అందజేస్తామని తెలిపారు. మాస్ కాపీయింగ్, చూచిరాతలు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు. మాస్ కాపీయింగ్ను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. సమావేశంలో జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు శంకర్నాయక్, గురువయ్యశెట్టి, ప్రిన్సిపాల్స్ పరమేశ్వరరెడ్డి, సుంకన్న, కార్యాలయ సూపరింటెండెంట్ నల్లపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.