హిందూ ముస్లిం ఐక్యత పుస్తకావిష్కరణ
ABN , First Publish Date - 2021-12-20T03:34:29+05:30 IST
స్వాతంత్ర సమరయోధులు పండిత రాంప్రసాద్ బిస్మిల్, అష్పాకుల్లాఖాన్ సంస్మరణ సభ ఆదివారం పట్టణంలోని ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో జరిగింది.
కావలి, డిసెంబరు 19: స్వాతంత్ర సమరయోధులు పండిత రాంప్రసాద్ బిస్మిల్, అష్పాకుల్లాఖాన్ సంస్మరణ సభ ఆదివారం పట్టణంలోని ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో జరిగింది. వారి చిత్రపటాలకు జేఏసీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సయ్యద్ నసీర్ అహ్మద్ రచించిన ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంలో హిందూ-ముస్లిం ఐక్యత పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న జమాతే ఇస్లామి హింద్ రాష్ట్రప్రధాన కార్యదర్శి మహ్మద్ హిమాయత్ మాట్లాడుతూ హిందూ ముస్లిం ఐక్యతకు చిహ్నంగా నిలిచి దేశం కోసం ఉరికంబాన్ని ఎక్కి అమరులైన వారి త్యాగం వృథా కాదన్నారు. జేఏసీ కన్వీనర్ చింతాల వెంకట్రావు మాట్లాడుతూ వీరి మరణ ప్రకటనలో వారు రాసిన మాటలు ముందు మనం భారతీయులం, ఆ తర్వాత హిందూ, ముస్లింలం. మనలో మనం కలహించుకోవటం మాని దేశ స్వేచ్ఛ కోసం పోరాడాలని రాశారన్నారు. సీపీఐ నేత డేగా సత్యం, సీపీఎం నేత పెంచలయ్య, న్యూడెమోక్రసీ నాయకుడు భాస్కర్లు హిందూ ముస్లీం ఐక్యత ఆవశ్యకతను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో షాన్వాజ్, చాంద్బాషా, సయ్యద్ జిలానీ, సయ్యద్ సిరాజ్, సలీం, హౌలానా, హఫీజ్, మస్తాన్ , ఖాదర్బీ తదితరులు పాల్గొన్నారు.
ఉదయగిరి రూరల్ : స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో ఆదివారం ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో సయ్యద్ నసీర్ అహ్మద్ రచించిన ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంలో హిందూ-ముస్లిం ఐక్యత అనే పుస్తకాన్ని నాయకులు ఆవిష్కరించారు. తొలుత రాంప్రసాద్ బిస్మిల్, ఆష్ఫాఖ్ఖాన్ బిస్మల్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీపీఎం నాయకులు కాకు వెంకటయ్య మాట్లాడుతూ రాంప్రసాద్, ఆష్ఫాఖ్ఖాన్లు బ్రిటీష్ పాలకుల కబంధహస్తాల నుంచి దేశాన్ని కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో ఖాదర్బాషా, దస్తగిరి, ఫరుద్ధీన్బాషా, మన్సూర్, కామాక్షమ్మ, నాయబ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.