లంబసింగి సమీపంలో మరో వ్యూపాయింట్
ABN , First Publish Date - 2021-12-31T06:22:38+05:30 IST
ఆంధ్రకశ్మీర్ లంబసింగికి సమీపంలో స్థానిక గిరిజనులు మరో వ్యూపాయింట్ని కొనుగొన్నారు.
రాజుపాకలు కొండపై మంచు మేఘాలు
చింతపల్లి, డిసెంబరు 30: ఆంధ్రకశ్మీర్ లంబసింగికి సమీపంలో స్థానిక గిరిజనులు మరో వ్యూపాయింట్ని కొనుగొన్నారు. రాజుపాకలు కొండపై చెరువులవేనం తలపించే మంచు అందాలు ఆవిష్కృతమవుతున్నాయని స్థానికులు గుర్తించారు. మూడేళ్ల క్రితం చెరువులవేనం ప్రకృతి అందాలను తొలిసారిగా ‘ఆంధ్రజ్యోతి’ బాహ్యప్రపంచానికి పరిచయం చేసింది. చెరువులవేనం పొలిన హిల్స్ రాజుపాకలు సమీపంలో ఉన్నాయి. ఇక్కడ లేటరైట్ కొండపై కూడా మంచు మేఘాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఈ వ్యూపాయింట్కి వెళ్లేందుకు మడిగుంట-రాజుపాకలు ప్రధాన రహదారిలో కాఫీతోటలకు పక్కనున్న కాలిబాటలో కొండపైకి వెళ్లాలి. రాజుపాకలు నుంచి 30 నిమిషాలు ప్రయాణిస్తే ఈ కొండ వస్తుంది. ఈ కొండపైకి వెళ్లేందుకు స్థానిక గిరిజనులు కాలిబాట కూడా సిద్ధం చేశారు.