నకిలీ చలానాల కుంభకోణంలో ఆరుగురి అరెస్ట్
ABN , First Publish Date - 2021-08-28T04:39:28+05:30 IST
గజపతినగరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలానాల కేసు నిగ్గు తేలింది. మొత్తం ఆరుగురు వ్యక్తులకు పోలీసులు అరెస్ట్ చేశారు. 128 డాక్యుమెంట్లకు సంబంధించి రూ.35 లక్షల అవినీతి జరిగినట్టు దర్యాప్తులో వెల్లడైంది. శుక్రవారం స్థానిక పోలీస్స్టేషన్లో బొబ్బిలి డీఎస్పీ బి.మోహనరావు కేసు వివరాలను వెల్లడించారు. స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో
128 డాక్యుమెంట్లకు సంబంధించి రూ.35 లక్షల అవినీతి
బొబ్బిలి డీఎస్పీ మోహనరావు
గజపతినగరం, ఆగస్టు 27: గజపతినగరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలానాల కేసు నిగ్గు తేలింది. మొత్తం ఆరుగురు వ్యక్తులకు పోలీసులు అరెస్ట్ చేశారు. 128 డాక్యుమెంట్లకు సంబంధించి రూ.35 లక్షల అవినీతి జరిగినట్టు దర్యాప్తులో వెల్లడైంది. శుక్రవారం స్థానిక పోలీస్స్టేషన్లో బొబ్బిలి డీఎస్పీ బి.మోహనరావు కేసు వివరాలను వెల్లడించారు. స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ నెల 10న ఆడిట్ జరిగింది. ఇందులో నకిలీ చలానాల విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే సబ్ రిజిస్ట్రార్ ఈశ్వరమ్మ పోలీసులతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 10 వరకూ 69 డాక్యుమెంట్లకు సంబంధించి నకిలీ చలానాలతో రూ.21,67,985 లను పక్కదారి పట్టించినట్టు గుర్తించారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకూ 61 డాక్యుమెంట్లకు సంబంధించి రూ.13,50,605ల అవినీతి జరిగినట్టు దర్యాప్తులో వెల్లడైంది. దీనికి డాక్యుమెంట్ రైటర్లు రొంగళి బంగారునాయుడు, సార నారాయణరావు, రుద్ర మల్లేష్, గేదెల రామ్మూర్తినాయుడుతో పాటు డాక్యుమెంట్ అసిస్టెంట్ శనపతి గణేష్, కంప్యూటర్ ఆపరేటర్ కొల్లూరు సాయిగణేష్లు బాధ్యులుగా విచారణలో తేలినట్టు డీఎస్పీ మోహనరావు తెలిపారు. కేసు నమోదుచేసి ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో సీఐ రమేష్, ఎస్ఐ గంగరాజ్ పాల్గొన్నారు.