వైభవంగా ఆయుధ పూజ
ABN , First Publish Date - 2021-10-15T04:38:32+05:30 IST
దసరా ఉత్సవాల్లో భాగంగా ఏటా విజయదశమి ముందురోజు బొబ్బిలి కోటలో చేపట్టే ఆయుధ పూజ ఈ ఏడాది కూడా గురువారం వైభవంగా జరిగింది. చరిత్రాత్మక బొబ్బిలి యుద్ధంలో నాటి రాజులతో పాటు, బొబ్బిలి వీరునిగా పేరొందిన తాండ్ర పాపారాయుడు, ఇతర సైన్యం వినియోగించిన తుపాకులు, కత్తులు, డాళ్లకు శాస్ర్తోక్తంగా పూజలు చేశారు.
బొబ్బిలి కోటలో నిర్వహణ
అతికొద్దిమందితో పూజలు
బొబ్బిలి, అక్టోబరు 14: దసరా ఉత్సవాల్లో భాగంగా ఏటా విజయదశమి ముందురోజు బొబ్బిలి కోటలో చేపట్టే ఆయుధ పూజ ఈ ఏడాది కూడా గురువారం వైభవంగా జరిగింది. చరిత్రాత్మక బొబ్బిలి యుద్ధంలో నాటి రాజులతో పాటు, బొబ్బిలి వీరునిగా పేరొందిన తాండ్ర పాపారాయుడు, ఇతర సైన్యం వినియోగించిన తుపాకులు, కత్తులు, డాళ్లకు శాస్ర్తోక్తంగా పూజలు చేశారు. కరోనా నేపథ్యంలో అభిమానులు, కార్యకర్తల సందడి లేకపోయినా ఆయుధ పూజను ఆడంబరంగానే నిర్వహించారు. రాజవంశీయులైన మాజీ మంత్రి ఆర్వీ సుజయ్కృష్ణరంగారావు, తన సోదరుడు ఆర్వీఎస్కేకే రంగరావు (బేబీనాయన), కుమారుడు విశాల్, బీబీనాయన తనయ మేథతో కలిసి ఆయుధ పూజను స్థానిక దర్బార్ మహల్లో నిర్వహించారు. తొలుత నాటి రాజులు వినియోగించిన బంగారు, వెండి సింహాసనాలను ప్రధాన కోట నుంచి మేళతాళాలతో, ప్రత్యేక అలంకరణలు, వేషఽధారణలతో వందిమాగధులు, అనుచరగణంతో దర్బారు మహల్కు సంప్రదాయబద్ధంగా తోడ్కొని వచ్చారు. ఇద్దరు సోదరులు వజ్ర వైఢూర్యాలతో కూడిన తలపాగాలు, ఆభరణాలు, దుస్తులు ఽధరించి పూజాస్థలానికి చేరుకున్నారు. కోటలో పనిచేసే ఉద్యోగులంతా వారి నడిచారు. దర్బారుమహల్లో అగ్రభాగాన స్వర్ణసింహాసనాన్ని ఏర్పాటు చేసి రెండు వైపులా వెండి సింహాసనాన్ని, సాదా సింహాసనాన్ని ఏర్పాటు చేశారు. స్వర్ణ సింహాసనంపై దివంగత బొబ్బిలి రాజా, నాటి మద్రాసు ఉమ్మడి రాష్ర్టాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆర్ఎస్ఆర్కె రంగారావు (బొబ్బిలి రాజవంశంలో ఆఖరి పట్టాభిషిక్తులు) చిత్రపటాన్ని, వెండి సింహాసనంపై ఆయన తనయుడైన ఆర్వీజీకే రంగారావు చిత్రపటాలను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. మరో సముచితాసనంపై ఆధ్యాత్మికవేత్త చినజీయరు స్వామి చిత్రపటాన్ని ఉంచారు. ఆయుధ పూజ అనంతరం సుజయ్, బేబీనాయనలు విలేకరులతో మాట్లాడుతూ వందల ఏళ్లుగా వస్తున్న ఆచార, సంప్రదాయాలను గౌరవిస్తున్నామని చెప్పారు. కరోనా కారణంగా ఈ ఏడాది అభిమానులను ఆహ్వానించలేకపోయామన్నారు.