సింగపూర్ నుంచి వచ్చిన మహిళకు కరోనా లక్షణాలు
ABN , First Publish Date - 2021-02-08T12:26:39+05:30 IST
సింగపూర్ నుంచి విమానంలో ఆదివారం ఉదయం తిరుచ్చికి వచ్చిన మహిళకు కరోనా లక్షణాలుండడం అధికారులను దిగ్ర్భాంతికి గురిచేసింది. సింగపూర్, మలేసియా...
చెన్నై/పెరంబూర్ (ఆంధ్రజ్యోతి): సింగపూర్ నుంచి విమానంలో ఆదివారం ఉదయం తిరుచ్చికి వచ్చిన మహిళకు కరోనా లక్షణాలుండడం అధికారులను దిగ్ర్భాంతికి గురిచేసింది. సింగపూర్, మలేసియా, దుబాయ్, మస్కట్, ఒమన్ సహా పలు దేశాల్లో లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులను స్వదేశానికి రప్పించేలా కేంద్రప్రభుత్వం ప్రత్యేక విమానాలు నడుపుతోంది. ఆ విమానాల్లో ప్రయాణం చేసేవారికి ఆయా దేశాలు కరోనా పరీక్షలు నిర్వహించి నెగిటివ్ వచ్చిన వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతించాలని కేంద్రప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో, ఆదివారం ఉదయం 7.30 గంటలకు సింగపూర్ నుంచి ఎయిర్ ఇండియా విమానం 169 మంది ప్రయాణికులతో తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకుంది. ఆ విమానంలో ప్రయాణం చేసిన పుదుకోట జిల్లాకు చెందిన 38 ఏళ్ల మహిళకు కరోనా లక్షణాలున్నట్టు సర్టిఫికెట్లో ఉండగా, సదరు విమాన సంస్థ సిబ్బంది ఆమె ప్రయాణించేందుకు అనుమతించినట్టు తెలుస్తోంది. ఈ విషయం గుర్తించిన విమానాశ్రయ అధికారులు జిల్లా కలెక్టర్, ఆరోగ్యశాఖ అధికారులకు తెలియజేశారు. ఆరోగ్యశాఖ అధికారులు విమానాశ్రయానికి చేరుకొని ఆ మహిళను వెంటనే తిరుచ్చి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.