రెమ్డెసివిర్ నిబంధనలు మారుస్తారా?
ABN , First Publish Date - 2021-04-29T07:04:53+05:30 IST
కరోనా వైరస్ పీడితులకు ఇచ్చే రెమ్డెసివిర్ ఇంజెక్షన్ వినియోగానికి సంబంధించిన నిబంధనల మార్పుపై ఢిల్లీ హైకోర్టు మండిపడింది...
- రోగుల ప్రాణాలు పోవాలని ఉందా?.. వివేచన చేయకుండా నిర్ణయం
- మందుల పంపిణీ అస్తవ్యస్తం.. కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
- ఆక్సిజన్ రోగులకే రెమ్డెసివిర్ ఇవ్వాలన్న కేంద్రం నిర్ణయంపై కోర్టు సీరియస్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: కరోనా వైరస్ పీడితులకు ఇచ్చే రెమ్డెసివిర్ ఇంజెక్షన్ వినియోగానికి సంబంధించిన నిబంధనల మార్పుపై ఢిల్లీ హైకోర్టు మండిపడింది. ‘‘కేంద్ర ప్రభుత్వ ధోరణి చూస్తే రోగుల ప్రాణాలు పోవాలని అనుకుంటున్నట్లు కనిపిస్తోంది’’ అని హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. ప్రాణవాయువు అందిస్తున్న రోగులకు మాత్రమే రెమ్డెసివిర్ ఇంజక్షన్ ఇవ్వాలంటూ తాజాగా ఆదేశాలిచ్చిన నేపథ్యంలో న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభా సింగ్ బుధవారం ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘‘ఈ పద్ధతి తప్పు. ఇది పూర్తిగా వివేచన చేయకుండా తీసుకున్న నిర్ణయం. ఇపుడు ఆస్పత్రులలో ఆక్సిజన్ అందించని వారికి రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కూడా ఇవ్వరు. మీ వైఖరి చూస్తే రోగుల ప్రాణాలు పోవాలనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. మందుల పంపిణీ, నిర్వహణను పూర్తిగా అస్తవ్యస్తం చేశారు’’ అని జడ్జి కేంద్రాన్ని తప్పుబట్టారు. ఇప్పటికే బాగా కొరత ఏర్పడిన రెమ్డెసివిర్ వినియోగాన్ని తగ్గించేందుకే నిబంధనలలో మార్పు చేశారని కోర్టు వ్యాఖ్యానించింది.
నిబంధనలలో మార్పు చేయాల్సిన అవసరం ఉందా అన్న విషయాన్ని సమీక్షించే బాధ్యత ఒక వైద్య కమిటీకి అప్పగించడంపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని కోర్టు పేర్కొంది. ‘‘కొరతను తగ్గించడం కోసం మాత్రమే నిబంధనలలో మార్పు చేయొద్దు. అది తప్పు. ఫలితంగా అవసరమైన వారికి డాక్టర్లు రెమ్డెసివిర్ను సి ఫారసు చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది’’ అని జడ్జి పేర్కొన్నారు. ఢిల్లీకి మొత్తం 72 వేల సీసాల రెమ్డెసివిర్ కేటాయించగా, ఈనెల 27నాటికి 52 వేలకుపైగా సీసాలు పంపినట్లు కేంద్రం తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఢిల్లీకి చాలా తక్కువ ఇంజెక్షన్లు కేటాయించారని కోర్టు పేర్కొంది. ఒక ఎంపీ ఢిల్లీ నుం చి 10వేల రెమ్డెసివిర్ ఇంజెక్షన్ సీసాలను కొనుగోలు చేసి ఒక అద్దె విమానంలో మహారాష్ట్రలోని అహ్మద్నగర్కు తీసుకెళ్లడం దిగ్ర్భాంతి కలిగించిందని కోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీకి వచ్చిన కోటాను మరో రాష్ట్రానికి తరలించి పూర్తిగా అస్తవ్యస్తం చేశారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఢిల్లీకి పంపించిన 52 వేలకుపైగా రెమ్డెసివిర్ సీసాల్లో తమకు 2,500 సీసాలు మాత్రమే తమకు అందాయని ఢిల్లీ సర్కారు న్యాయవాది అనూజ్ అగర్వాల్ కోర్టుకు తెలిపారు. మరి మిగిలిన 50వేల సీసాల సంగతేంటని న్యాయమూర్తి ప్రశ్నించగా, అవన్నీ ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఆస్పత్రులకు, రోగులకు చేరాయని తెలిపారు. కరోనా సోకిన ఒక లాయర్ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని జడ్జి విచారించారు. రెమ్డెసివిర్ ఆరు డోసులకు తనకు 3 డోసులే ఇచ్చారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. కోర్టు జోక్యంతో సదరు లాయర్కు ఆస్పత్రి సిబ్బంది మిగిలిన మూడు డోసుల ఇంజెక్షన్లు మంగళవారం రాత్రి ఇచ్చారు. కాగా, ఆక్సిజన్ కొరత కారణంగా చనిపోయిన కొవిడ్ రోగుల వివరాలతో 4 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు ‘ఆప్’ సర్కారును ఆదేశించింది. ‘‘ప్రాణవాయువు కొరత కారణంగా ప్రాణాలు కోల్పోయిన రోగులకు పరిహారం చె ల్లించాలి. ఇది ప్రభుత్వ బాధ్యత కూడా’’ అని జస్టిస్ వి పిన్ సంఘీ, జస్టిస్ రేఖా పల్లీతో కూడిన బెంచ్ పేర్కొంది.