ప్రముఖ పారిశ్రామికవేత్త ఈఎస్‌ రెడ్డి కన్నుమూత

ABN , First Publish Date - 2021-04-24T15:54:31+05:30 IST

ప్రముఖ పారిశ్రమికవేత్త, చెన్నైలో తెలుగుకు నిలువెత్తు చిరునామాగా నిలిచిన ఏనుగు సీతారామిరెడ్డి(ఈఎస్‌ రెడ్డి) కన్నుమూశారు. ఆయన వ

ప్రముఖ పారిశ్రామికవేత్త ఈఎస్‌ రెడ్డి కన్నుమూత


  

చెన్నై: ప్రముఖ పారిశ్రమికవేత్త, చెన్నైలో తెలుగుకు నిలువెత్తు చిరునామాగా నిలిచిన ఏనుగు సీతారామిరెడ్డి(ఈఎస్‌ రెడ్డి) కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శుక్రవారం ఉదయం 10 గంటలకు బెంగుళూరులోని తన కుమార్తె నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈఎస్‌ రెడ్డిభౌతికకాయానికి అక్కడే అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నారు. ఈఎస్‌ రెడ్డి మృతి పట్ల ఆంధ్రా సోషల్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ (ఆస్కా) అధ్యక్షుడు డాక్టర్‌ కె.సుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.చక్రవర్తి, సంయుక్త కార్యదర్శి జేకే రెడ్డి, మాజీ అధ్యక్షులు ఎం.ఆది శేషయ్య, కె. నరసారెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి సాంబశివరావు, మాజీ సంయుక్త కార్యదర్శి ఎం.కృష్ణ, టీటీడీ చెన్నై సమాచారకేంద్ర సలహామండలి ఉపాధ్యక్షుడు అనిల్‌కుమార్‌రెడ్డి, మద్రాస్‌ యూనివర్సిటీ తెలుగుశాఖ మాజీ అధ్యక్షులు ఆచార్య జీవీఎ్‌సఆర్‌ కృష్ణమూర్తి, ఆచార్య మాడభూషి సంపత్‌ కుమార్‌, ప్రముఖ విద్యావేత్త డాక్టర్‌ తూమాటి సంజీవరావు తదితరులు తీవ్ర సంతాపం ప్రకటించారు. చెన్నైలో తెలుగువారికి ఆయన లేని లోటు పూడ్చలేనిదని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. 


బహుముఖ ప్రజ్ఞాశాలి ఈఎస్‌ రెడ్డి

వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయిన ఈఎస్‌ రెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి. నెల్లూరు జిల్లాకు చెందిన ఆయన అప్పటి మద్రాసు లయోలా కాలేజీలో బీఎస్సీ పూర్తి చేశారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే స్థిరనివాసం ఏర్పర చుకుని ‘మద్రాస్‌ ఇండస్ట్రియల్‌ కెమికల్‌ ఏజెన్సీస్‌’ అనే సంస్థను స్థాపించి  వ్యాపారవేత్తగా రాణించారు. ఆయన 1975-79, 1983-85, 1987-89, 1991-93 కాలాల్లో ఆస్కా అధ్యక్షుడిగా వ్యవహరించారు. ప్రధాన కార్యదర్శిగా మూడు పర్యాయాలు బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా పొట్టి శ్రీరాములు స్మారకభవన కమిటీ అధ్యక్షుడిగా, కూచిపూడి అకాడమీ అధ్యక్షుడిగా, ఆంధ్ర మహిళా సభ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ‘తెలుగు మహాజన సమాజం’ అధ్యక్షుడిగా వున్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న వేణుగోపాల్‌ విద్యాలయం’ సర్వతోముఖాభి వృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. అనేక తెలుగు సంస్థలకు పరోక్షంగా సహకరించారు. వృత్తిరీత్యా పారిశ్రామికవేత్త అయినప్పటికీ ఆయనకు తెలుగు భాష, సాహిత్యం, సాంస్కృతి, చరిత్ర, రాజకీయాలంటే ఎంతో ఆసక్తి. దేశానికి స్వాతంత్య్రం రాకపూర్వం మద్రాసు పట్టణం విషయాలు, నాటి విశేషాలు చెప్పగిలిగిన వ్యక్తుల్లో ఆయన ఒకరు. 

Updated Date - 2021-04-24T15:54:31+05:30 IST