కాంగ్రెస్‌కు బిగ్ షాక్! బీజేపీలోకి జితిన్ ప్రసాద

ABN , First Publish Date - 2021-06-09T19:13:33+05:30 IST

న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో రైల్వే మంత్రి పీయుష్ గోయల్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. రాహుల్‌ గాంధీకి అత్యంత సన్నిహితుల్లో ఒకడైన జితిన్ ప్రసాద యూపీ ఎన్నికల వేళ బీజేపీలో చేరడం సంచలనం రేకెత్తించింది.

కాంగ్రెస్‌కు బిగ్ షాక్! బీజేపీలోకి జితిన్ ప్రసాద

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. యువ నాయకుడు జితిన్ ప్రసాద బీజేపీలో చేరారు. న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో రైల్వే మంత్రి పీయుష్ గోయల్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. రాహుల్‌ గాంధీకి అత్యంత సన్నిహితుల్లో ఒకడైన జితిన్ ప్రసాద యూపీ ఎన్నికల వేళ బీజేపీలో చేరడం సంచలనం రేకెత్తించింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జితిన్ ప్రసాద గత ఏడాది జులైలో బ్రాహ్మణ చేతనా పరిషత్ నెలకొల్పి ఆ సామాజిక వర్గ సమస్యల పరిష్కారానికి యత్నిస్తున్నారు కూడా. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన జితేంద్ర ప్రసాద తనయుడే జితిన్. 2001లో యూత్ కాంగ్రెస్‌లో చేరిన జితిన్ 2004 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని షాజహాన్‌పూర్‌ నుంచి పోటీ చేశారు. యూపిఏ హయాంలో మన్మోహన్ కేబినెట్‌లో యువ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీతో తనకు మూడు తరాల అనుబంధం ఉందని, బీజేపీ ఒక్కటే జాతీయ పార్టీ అని, మిగతా వన్నీ ప్రాంతీయ పార్టీలేనని జితిన్ ప్రసాద బీజేపీలో చేరాక విలేకరులతో అన్నారు. 






ప్రస్తుతం జాతీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీయని, జాతీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న పార్టీ బీజేపీయేనని జితిన్ ప్రసాద అన్నారు. బీజేపీలో చేరిన అనంతరం ఆయన మంత్రి పీయుష్‌తో కలిసి పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 

Updated Date - 2021-06-09T19:13:33+05:30 IST