కోవిడ్‌పై పోరులో భారత్‌కు పాకిస్థాన్ సంఘీభావం

ABN , First Publish Date - 2021-04-24T19:35:32+05:30 IST

కోవిడ్-19 మహమ్మారిపై కలిసికట్టుగా పోరాడదామని పాకిస్థాన్

కోవిడ్‌పై పోరులో భారత్‌కు పాకిస్థాన్ సంఘీభావం

ఇస్లామాబాద్ : కోవిడ్-19 మహమ్మారిపై కలిసికట్టుగా పోరాడదామని పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. ప్రపంచానికి ఈ వైరస్ విసురుతున్న సవాలును ఎదుర్కొనడంలో భారత దేశానికి సంఘీభావం ప్రకటించారు. పొరుగు దేశాలు, ప్రపంచంలో ఈ వ్యాధి బారిన పడినవారంతా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్ శనివారం ఓ ట్వీట్ చేశారు. 


ఇమ్రాన్ ఖాన్ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, భారతీయులు ప్రమాదకరమైన కోవిడ్-19 ప్రభంజనంతో యుద్ధం చేస్తున్నారని, వారికి సంఘీభావం ప్రకటిస్తున్నానని పేర్కొన్నారు. పొరుగు దేశాలు, ప్రపంచంలో ఈ మహమ్మారి బాధితులంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మానవాళి ఎదుర్కొంటున్న ఈ అంతర్జాతీయ సవాలుపై మనమంతా కలిసికట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు. 


ఇదిలావుండగా, పాకిస్థానీలు శుక్రవారం ట్విటర్ వేదికగా భారత దేశంపై సానుభూతి ప్రకటించారు. భారత దేశానికి ఈ కష్టకాలంలో సాయపడాలని ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను కోరారు. కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం వల్ల భారతీయులు ఆక్సిజన్ కొరత, ఇతర అత్యవసర సాయం కోసం ఎదురు చూస్తున్నారని, వారికి సాయపడాలని ఖాన్‌ను కోరారు. #ఇండియానీడ్స్ఆక్సిజన్ వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. రాజకీయ విభేదాలను పక్కనబెట్టాలని, భారత దేశం ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి సాయపడాలని కోరారు. 


Updated Date - 2021-04-24T19:35:32+05:30 IST