కరోనా టీకా తీసుకున్న మొట్టమొదటి మహిళా జర్నలిస్టు ఏం చెప్పారంటే...
ABN , First Publish Date - 2021-01-05T17:06:40+05:30 IST
ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్సు)లో కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న మొట్టమొదటి మహిళా జర్నలిస్టు పూజామక్కర్ తాజాగా టీకా గురించి పలు విషయాలు....
న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్సు)లో కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న మొట్టమొదటి మహిళా జర్నలిస్టు పూజామక్కర్ తాజాగా టీకా గురించి పలు విషయాలు వెల్లడించారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ టీకా తీసుకున్న 20 గంటల తర్వాత తాను బాగున్నానని చెప్పారు. కరోనా టీకా సురక్షితమని పూజామక్కర్ స్పష్టం చేశారు. ‘‘నేను కొరోనా వ్యాక్సిన్ తీసుకొని 20 గంటలు అయ్యింది.కోవాక్సిన్ తీసుకున్నాక నేను బాగున్నాను.నేను సాధారణంగా ఉన్నాను.దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనావైరస్ వ్యాక్సిన్ గురించి పుకార్లను నమ్మవద్దని ప్రజలను కోరుతున్నాను.ఈ టీకా పూర్తిగా సురక్షితం. చింతించాల్సిన పనిలేదు. ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం ఉంచాలని నేను కోరుతున్నాను ”అని పూజా మక్కర్ వివరించారు.
టీకా తీసుకున్న తర్వాత దీని ప్రభావం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇప్పటివరకు ఏ సమస్య లేదని పూజా చెప్పారు. కరోనా టీకా పూర్తిగా సురక్షితమని సామాన్య ప్రజల్లో విశ్వాసం కలిగించేందుకే తాను టీకా వేయించుకున్నానని పూజా స్పష్టం చేశారు. 28 రోజుల తర్వాత పూజాకు మరో టీకా వేయాలి. ఐసీఎంఆర్ తో కలిసి కరోనాకు వ్యతిరేకంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన స్వదేశీ కోవాక్సిన్ 200శాతం సురక్షితమని కంపెనీ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా చెప్పారు.