Chennai: 6.29 కోట్ల మంది ఓటర్లు
ABN , First Publish Date - 2021-11-02T13:19:37+05:30 IST
రాష్ట్రంలో 6,28,94,531 మంది ఓటుహక్కు కలిగి ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసిన ముసాయిదా జాబితాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండడం గమనార్హం. ఈనెల 30వ
- ముసాయిదా జాబితా విడుదల
- 13, 14, 27, 28 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు
ప్యారీస్(చెన్నై): రాష్ట్రంలో 6,28,94,531 మంది ఓటుహక్కు కలిగి ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసిన ముసాయిదా జాబితాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండడం గమనార్హం. ఈనెల 30వ తేదీ వరకు కొత్త ఓటర్లు పేర్లు నమోదు చేసుకొనేందుకు, తొలగించేందుకు, సవరించుకొనేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఈనెల 13, 14, 27, 28 తేదీల్లో నిర్వహించనున్న ప్రత్యేక ఓటరు శిబిరాల్లో పేరు చేర్చేందుకు ఫారం-6, పేరు తొలగింపుకు ఫారం-7, సవరణ, చిరునామా మార్పునకు ఫారం-8, వార్డు బదిలీకి ఫారం-8ఏను పూర్తిచేసి ఆయా శిబిరాల్లోనే సమర్పించేందుకు అవ కాశం కల్పించారు. సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రద సాహు ముసాయిదా ఓటరు జాబితాను సోమవారం విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6.29 కోట్ల మంది ఓటర్లున్నారని, వీరిలో పురుషులు 3,09,17,667 మంది, మహిళలు 3,19,69, 522 మంది, హిజ్రాలు 7,342 మంది ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలోనే అధికంగా చెంగల్పట్టు జిల్లా షోలింగనల్లూర్ నియోజకవర్గంలో 7.48 లక్షల మంది ఓటర్లున్నారని, తక్కువగా ఓటర్లు చెన్నై జిల్లా హార్బర్ నియోజక వర్గంలో 1,76,679 మంది ఉన్నారని వివరించారు.