ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచిన అమెరికా... తక్షణం కాల్పుల విరమణ జరగాలని స్పష్టీకరణ...

ABN , First Publish Date - 2021-05-20T02:38:29+05:30 IST

ఇజ్రాయెల్-పాలస్తీనా ఘర్షణలకు తెర దించేందుకు

ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచిన అమెరికా... తక్షణం కాల్పుల విరమణ జరగాలని స్పష్టీకరణ...

వాషింగ్టన్ : ఇజ్రాయెల్-పాలస్తీనా ఘర్షణలకు తెర దించేందుకు అమెరికా గట్టిగా ప్రయత్నిస్తోంది. పది రోజుల నుంచి జరుగుతున్న హింసాత్మక ఘర్షణలకు బుధవారంతో ముగింపు పలకాలని ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచింది. స్పష్టంగా ఉద్రిక్తతలు ముగిసిపోవాలని ఇజ్రాయెల్‌ను కోరింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గట్టిగా చెప్పారు. 


ఇజ్రాయెల్, హమస్ మధ్య 10 రోజుల నుంచి జరుగుతున్న హింసాత్మక సంఘటనల్లో దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ అమెరికా తన మిత్ర దేశం ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచలేదు. జో బైడెన్ బుధవారం వరకు స్పష్టంగా స్పందించేందుకు ముందుకు రాలేదు. దీంతో ఆయనపై ఒత్తిడి పెరిగింది. గాజా స్ట్రిప్‌లో రద్దీగా ఉండే ప్రాంతంలో హమస్‌పై వైమానిక దాడులను ఆపేవిధంగా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తేవాలని డెమొక్రాటిక్ సభ్యుల నుంచి సైతం డిమాండ్లు పెరుగుతున్నాయి. 


ఈ నేపథ్యంలో వైట్ హౌస్ ఇచ్చిన ప్రకటనలో, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టెలిఫోన్ ద్వారా మాట్లాడారని, కాల్పుల విరమణ దిశగా అడుగులు వేయాలని చెప్పారని తెలిపింది. ఈరోజు (బుధవారం) ముగిసే సరికి ఉద్రిక్తతలు స్పష్టంగా తగ్గాలని చెప్పారని తెలిపింది. 


గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇజ్రాయెల్-పాలస్తీనా ఘర్షణల్లో దాదాపు 219 మంది ప్రాణాలు కోల్పోయారు, వీరిలో 63 మంది బాలలు, 36 మంది మహిళలు ఉన్నారు. 1,530 మంది గాయపడ్డారు. 


Updated Date - 2021-05-20T02:38:29+05:30 IST