‘దూరప్రాంత రైళ్లు రద్దు చేయలేదు’
ABN , First Publish Date - 2021-11-09T15:52:41+05:30 IST
దూరప్రాంతాలకు నడిపే రైళ్లను రద్దు చేయలేదని దక్షిణ రైల్వే చెన్నై డివిజన్ అధికారులు తెలిపారు. నగరం, శివారు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా రైలుపట్టాలపై వరద నీరు భారీ స్థాయిలో నిలిచింది.
- దక్షిణ రైల్వే ప్రకటన
ప్యారీస్(చెన్నై): దూరప్రాంతాలకు నడిపే రైళ్లను రద్దు చేయలేదని దక్షిణ రైల్వే చెన్నై డివిజన్ అధికారులు తెలిపారు. నగరం, శివారు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా రైలుపట్టాలపై వరద నీరు భారీ స్థాయిలో నిలిచింది. ఇందువల్ల సెంట్రల్ రైల్వేస్టేషన్ నుంచి సాయంత్రం సమయంలో కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యంగా బయల్దేరి వెళ్లాయి. మంగళూరు ప్రత్యేక ఎక్స్ప్రెస్, జైపూర్ సూపర్ ఫాస్ట్ 3 గంటల ఆలస్యంగా, కోవై జిల్లా మేట్టు పాళయం సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గంట ఆలస్యంగా చెన్నై సెంట్రల్ నుంచి బయల్దేరాయి. కొచ్చివెలి, ఆలపులా, దర్బా ప్రాంతాల నుంచి ఆదివారం బయల్దేరిన రైళ్లు చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్కు రాకుండా పెరంబూర్, వ్యాసర్పాడి మీదుగా మళ్లించారు. రాత్రి సెంట్రల్ నుంచి బయల్దేరాల్సిన కొన్ని రైళ్లు, తిరువళ్లూర్, ఆవడి, చెన్నై బీచ్ తదితర ప్రాంతాల నుంచి బయల్దేరాయి. కాగా, సోమవారం ఉదయం 6.35 గంటలకు సెంట్రల్ నుంచి నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ 3.25 గంటల అలస్యంగా ఉదయం 10 గంటలకు బయల్దేరి వెళ్లింది.