డైట్ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2021-12-19T05:54:03+05:30 IST
గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు సరైన ఆహారం పెట్టకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహిస్తున్నాడని సీపీఐ నగర కార్య దర్శి కనకరాజు, సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ ఆరోపించారు.
- ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన సీపీఐ నాయకులు
కళ్యాణ్నగర్, డిసెంబరు 18: గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు సరైన ఆహారం పెట్టకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహిస్తున్నాడని సీపీఐ నగర కార్య దర్శి కనకరాజు, సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ ఆరోపించారు. శనివారం వారు గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలోని బాలింతల వార్డులను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలింతలు వార్డులో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వాష్ రూమ్లకు తలుపులు లేవని, దీంతో దుర్వాసన వస్తోందని, వార్డుల్లో బెడ్లకు మధ్య దూరం లేకపోవడంతో అటెండర్లు ఇబ్బందులు ఎదుర్కొవడంతో పాటు కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోపించారు. బాలింతలకు సరైన డైట్ అందించకపోవడంవల్ల ఇంటినుంచే భోజనం తెచ్చుకుంటున్నారని తెలిపారు. రోజువారి మెనూ ప్రకారం బాలింతలకు పాలు, గుడ్డు, బ్రెడ్, డ్రైఫ్రూట్స్ ఇవ్వాల్సి ఉండగా కాంట్రాక్టర్ డ్రైఫ్రూట్స్ ఇవ్వడం లేదన్నారు. పాత కాంట్రాక్టర్ ఇక్కడ నుంచి కదలడం లేదని, కొత్త కాంట్రాక్టర్ రావడం లేదని, భోజనం పెట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఆసుపత్రిలో కొత్త డైట్ కాంట్రాక్టర్ను నియమించాలని వారు కలెక్టర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ను కోరారు. ఆసుపత్రిలోని సందర్శించిన వారిలో సీపీఐ నాయకులు తొపుడునూరి రమేష్, మండల శ్రీనివాస్, నరేష్, శ్రీను ఉన్నారు.