మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం
ABN , First Publish Date - 2021-12-19T06:27:22+05:30 IST
వేములవాడ ప్రాంత నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా వంద పడుకల ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేష్బాబు అన్నారు. మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ 6వ వార్డు పరిధిలోని వంద పడకల ఆస్పత్రి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు.
- త్వరలోనే మరిన్ని సేవలు
- ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేష్బాబు
వేములవాడ టౌన్, డిసెంబరు 18 : వేములవాడ ప్రాంత నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా వంద పడుకల ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేష్బాబు అన్నారు. మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ 6వ వార్డు పరిధిలోని వంద పడకల ఆస్పత్రి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే రమేష్బాబు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలను అందించాలనే ఆసుపత్రిని ప్రారంభించినట్లు చెప్పారు. ఆసుపత్రిలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆసుపత్రికి అవసరమున్న సీసీ కెమెరాలు, వాటర్ ప్లాంట్ , అత్యవసర జనరేటర్తోపాటు మౌలిక వసతుల కల్పన కృషి చేస్తానని హామీచ్చారు. ఆక్సిజన్ ప్లాంట్ త్వరలో అందుబాటులోకి రానుందని, సీటీ స్కాన్, అల్ర్టా సౌండ్ స్కానింగ్ సైతం మంజూరయ్యాయన్నారు. ఎల్వోటీ ట్యాంకు పూర్తికావస్తున్నట్లు చెప్పారు. ఆసుపత్రి ప్రారంభమైన నాలుగు నెలల్లోనే విజయవంతంగా 135 డెలివరీలు, 35 సర్జరీలు, సుమారు 18 వేల మంది ఔట్ పేషెంట్లు ఆసుపత్రిలో వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే సిబ్బందికి నాణ్యమైన వైద్యం అందించిన వైద్యసిబ్బందిని అభినందించారు. సీ మాక్ ఏర్పాటుకు మంత్రి కేటీఆర్తో మాట్లాడి మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. ఆసుపత్రికి కావాల్సిన డాక్టర్లు, నిధుల కొరత లేకుండా ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సమకూరుస్తానన్నారు. సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ రేగులపాటి మహేష్రావు, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు, జడ్పీటీసీలు మ్యాకల రవి, నాగం భూమయ్య, ఎంపీపీ బూర వజ్రవ్వబాబు, బైరగోని లావణ్య, గంగం స్వరూప, కౌన్సిలర్ నీలం కళ్యాణిశేఖర్ తదితరులు ఉన్నారు.