ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకోం
ABN , First Publish Date - 2021-12-31T05:20:33+05:30 IST
అధికారులు చేసే తప్పిదాలకు కింది స్థాయి ఉద్యోగులను బాధ్యులను చేసి ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకోమని నీటిపారుదల శాఖ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు మారం జగధీశ్వర్ హెచ్చరించారు.
- నీటి పారుదల శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్
తిమ్మాపూర్, డిసెంబరు 30: అధికారులు చేసే తప్పిదాలకు కింది స్థాయి ఉద్యోగులను బాధ్యులను చేసి ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకోమని నీటిపారుదల శాఖ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు మారం జగధీశ్వర్ హెచ్చరించారు. మండలంలోని ఎల్ఎండీ కాలనీలో గల ఇంజనీర్ ఇన్ చీఫ్ నీటిపారుదల శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో నీటిపారుదల శాఖ ఉద్యోగుల అత్యవసర సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి మారం జగదీశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు తమ సమస్యలను తెలిపారు. అనతరం జగదీశ్వర్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కార్యాయలంలో విధులు నిర్వర్తిస్తున్న ఎన్టీపీఏ ఎం లక్ష్మణ్, సూపరింటెండెంట్ ఎం అనిల్ను కలెక్టర్ సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తున్నామనారు. ఉద్యోగుల సస్పెన్షన్ను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 317 జీవో నీటిపారుదల శాఖకు వర్తించదని, ఇప్పటికే రీ ఆర్గనైజేషన్ చేశామని చెప్పిన ఉన్నతధికారులు ఇప్పుడు డిస్ట్రిక్ట్, జోనల్, మల్టీజోనల్ పేరిట ఉద్యోగులను బదిలీలు చేస్తూ ఇబ్బంది పెడతున్నారన్నారు. నీటిపారుదల శాఖలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వర్తించదని చెప్పిన ఉన్నతాధికారులు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి మినహాయింపు భాధ్యతను తీసుకోవాల్సి ఉండగా పట్టించుకోలేదని విమర్శించారు. దీంతో జిల్లా కేడర్ను విభజనను కలెక్టర్కు అప్పగించారన్నారు. దీనిలో భాగంగా ఉమ్మడి జిల్లాలో మూడు నీటి పారుదల శాఖకు సంబంధించి మూడు చీఫ్ ఇంజనీరింగ్ కార్యాలయాలకు సంబంధించిన జాబితాను ఇద్దరు ఈఎస్సీలు కలెక్టర్ వద్దకు వచ్చి సరిచేసుకున్నారన్నారు. కరీంనగర్ ఈఎస్సీ శంకర్ కలెక్టర్ వద్దకు వెళ్లకుండా ఉద్యోగులను పంపించడంతో వారు వాటిపైౖ సరియైునా వివరణ ఇవ్వలేదన్నారు. దీంతో కలెక్టర్ ఇద్దరు ఉద్యోగులను ఎలాంటి నోటిసులు ఇవ్వకుండా సస్పెండ్ చేశారన్నారు. తమ కార్యాలయ ఉద్యోగులు సస్పెండ్ అయి మూడు రోజులు గడిచినా ఈఎన్సీ ఇప్పటికీ కార్యాలయానికి రాలేదన్నారు. నీటిపారుదల శాఖలో సీనియారిటీ ఫైనల్ చేయకుండా జోనల్, మల్టీజోనల్ పేరిటదూర ప్రాంతాలకు ఉద్యోగులను బదిలీలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. జోనల్ వ్యవస్థ నీటి పారుదల శాఖలో వర్తించదు అంటే వెంటనే బదిలీలను నిలిపి వేయాలని, జోనల్ వ్యవస్థ వర్తిస్తుంది అంటే జిల్లా కేడర్ను, జోనల్ కేడర్ను ఒక్కటిగా తీసుకోవాలని కోరారు. చర్యలు తీసుకొనేముందు ఉద్యోగ సంఘ నాయకుల దృష్టికి తీసుకురాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగుల సస్పెన్షన్ వెంటనే ఎత్తి వేయాలని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని శుక్రవారం నుంచి ఉద్యోగులందరితో కలిసి కార్యాచరణ చేపట్టనున్నట్లు మారం జగదీశ్వర్ తెలిపారు. నీటిపారుదల శాఖ ఉద్యోగ సంఘ నాయకులకు జిల్లా టీఎన్జీవోస్, నాలుగో తరగతి ఉద్యోగ సంఘాల మద్దతు తెలిపారు. వారు కూడా ఉద్యోగ సమస్యల కోసం పోరాటంలో మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ రాష్ట్ర కార్యదర్శి సంగెం లక్ష్మణ్రావు, జిల్లా కార్యదర్శి దారం శ్రీనివాస్రెడ్డి, హర్మిందర్ సింగ్, తిమ్మాపూర్ యూనిట్ అధ్యక్షుడు పోలు కిషన్, జిల్లా నాయకులు నాగరాజు, గంగారపు రమేష్, పవన్, రవీందర్ రెడ్డి, రాఘవ రెడ్డి, ధనలక్ష్మి, సరిత, వెంకటేశ్వర్రావు, మామిడి రమేష్, రామస్వామి పాల్గొన్నారు.