ధాన్యం కొనేవారేరీ?
ABN , First Publish Date - 2021-05-03T03:41:45+05:30 IST
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతు లు నానా అవస్థలు పడుతున్నారు.
- ఆర్ఎన్ఆర్ రకం ధాన్నాన్ని తిరస్కరిస్తున్న వ్యాపారులు, మిల్లర్లు
- ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతుల కష్టాలు
- ధర తగ్గించి కొనుగోలు చేస్తున్న దళారులు...దళారుల చేతుల్లో మోసపోతున్న రైతులు
ఊర్కొండ, మే 2: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఆర్ఎన్ఆర్ ధాన్యం పండించిన రైతు పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. ఆర్ఎన్ఆర్ ధాన్యం తేమ శాతం ఎక్కువగా ఉంద ని మిల్లర్లు కొనుగోలు చేయడం లేదనే సాకుతో వ్యాపారులు మద్దతు ధర చెల్లించ కుండా వారి ఇష్టానుసారంగా ధర వేస్తున్నారని, వారిని అడిగే వారు లేరని రైతులు వాపోతున్నారు. పండించిన పంటను మార్కెట్కు తీసుకువెళ్లి తిరిగి ఇంటికి తీసుకురా లేక వచ్చిన కాడికి చాలు అని మార్కెట్లో దళారులకు విక్రయిస్తున్నామని, దళారులు, వ్యాపారులు, మిల్లర్లు కలిసి ఆడుతున్న నాటకమని రైతులు ఆరోపిస్తున్నారు. కల్వకుర్తి పీఏసీఎస్ ఆధ్వర్యంలో 21 వరి కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తున్నారని, అందులో 1010 రకం మాత్రమే కొంటుండటంతో ఆర్ఎన్ఆర్ పండించి న రైతులు ధాన్యాన్ని ఇంటి వద్ద, కళ్లాల్లో ఉంచుకొని వర్షానికి తడుస్తూ.. ఎండకు ఎండుతూ కాలం వెళ్లదీస్తున్నామని రైతులు వాపోతున్నారు. పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో తాలు పేరుతో రైతులను తూర్పారపట్టాలని చెప్పడంతో రైతులు వివిధ యంత్ర పరికరాలతో అదనపు ఖర్చులు భరిస్తూ తూర్పారబడుతున్నారు. అలా చేయడంతో అనుకున్న ధర రాక, ఖర్చులు విపరీతంగా పెరగడంతో అప్పులపాలు అవుతు న్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కష్టపడి పండించిన ధాన్యం అమ్మడానికి అవస్థలు రావడం మంచి పద్ధతి కాదని, రైతుల బాగుకోసం యత్నించాలని, రైతులను మోసం చేసి వ్యాపారం చేయడమనేది మిల్లర్లు, వ్యాపారస్తులు మానుకోవాలని హితవు పలుకుతున్నారు. వరి ధాన్యం 1010 రకమే కాకుండా ఆర్ఎన్ఆర్ రకం ధాన్యం సైతం కొనుగోలు చేయాలని రైతులు ప్రజా ప్రతినిధులును, అధికారులను కోరుతున్నారు.