రెండోరోజూ భూ నిర్వాసితుల ఆందోళన
ABN , First Publish Date - 2021-12-25T05:47:51+05:30 IST
గౌరవెల్లి ప్రాజెక్ట్ వద్ద పనులు జరగకుండా భూనిర్వాసితులు రెండో రోజైన శుక్రవారం టెంట్ వేసుకుని బెఠాయించి ఆందోళన నిర్వహించారు.
గౌరవెల్లి ప్రాజెక్ట్ కట్ట వద్ద టెంట్ వేసుకుని బైఠాయింపు... పలు పార్టీల నాయకుల మద్దతు
అక్కన్నపేట, డిసెంబరు 24: గౌరవెల్లి ప్రాజెక్ట్ వద్ద పనులు జరగకుండా భూనిర్వాసితులు రెండో రోజైన శుక్రవారం టెంట్ వేసుకుని బెఠాయించి ఆందోళన నిర్వహించారు. సీపీఐ, కాంగ్రె్స, శివసేన పార్టీల నాయకులు భూ నిర్వాసితుల ఆందోళనకు మద్దతు ప్రకటించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ భూ నిర్వాసితులకు రావాల్సిన న్యాయమైన పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులు చేస్తున్నదని ఆరోపించారు. పరిహారం డబ్బులు ఇవ్వాలని భూ నిర్వాసితులు పనులను అడ్డుకుంటే వారిపై లాఠీచార్జి చేసి కేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండ పోచమ్మ, మల్లన్నసాగర్, రంగనాయక్సాగర్ ముంపు బాధితులకు ఇచ్చినవిధంగానే గౌరవెల్లి ప్రాజెక్ట్బాధితులకు పరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందులో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, బీజేపీ రాష్ట్ర నేత కోమటిరెడ్డి రాంగోపాల్రెడ్డి, శివసేన నియోజకవర్గ ఇన్చార్జి ఐలేని మల్లికార్జున్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగపల్లి ఐలయ్య పాల్గొన్నారు.
మద్దతు తెలిపిన మంజులారెడ్డి
హుస్నాబాద్, డిసెంబరు 24 : న్యాయమైన పరిహారం కోసం ఆందోళన చేస్తున్న గౌరవెల్లి రిజర్వాయర్ నిర్వాసితులకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులారెడ్డి ప్రకటించారు. శుక్రవారం ఆమె గౌరవెల్లి రిజర్వాయర్ నిర్వాసితులు చేస్తున్న ఆందోళనలో పాల్గొన్నారు. పరిహారం ఇచ్చిన తరువాతే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి నిర్వాసితులకు రావాల్సిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.