కనీస వేతనాల జీవోలను వెంటనే సవరించాలి
ABN , First Publish Date - 2021-07-13T05:12:47+05:30 IST
పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.21వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గుండ్లమాచునూర్ హమాలీ కార్మిక సంఘం ఆవరణలో సోమవారం కార్మికులు నిరాహార దీక్ష చేపట్టారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష
హత్నూర/జిన్నారం/సంగారెడ్డి రూరల్/జహీరాబాద్, జూలై 12: పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.21వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గుండ్లమాచునూర్ హమాలీ కార్మిక సంఘం ఆవరణలో సోమవారం కార్మికులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు సాయిలు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తూ చాలీచాలని వేతనాలు చెల్లిస్తున్నారని అన్నారు. జహీరాబాద్లో సీఐటీయూ కార్యాలయం ముందు నాయకులు, కార్మికులు నిసరసన చేపట్టారు. జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో కనీస వేతనాల జీవో విడుదల చేయాలంటూ సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహరెడ్డి ఆధ్వర్యంలో కరపత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన విధంగా ఎన్హెచ్ఎం ఉద్యోగులు పీఆర్సీ అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజయ్య డిమాండ్ చేశారు. కలెక్టరేట్ సూపరింటెండెంట్కు వినతిపత్రం అందజేశారు.
బీఎంఎస్ ఆధ్వర్యంలో
సంగారెడ్డి అర్బన్: కార్మికుల కనీస వేతనాల జీవోలను వెంటనే సవరించాలని బీఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూర్పు రామ్రెడ్డి డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.