రూ.లక్షలు వసూలు చేసి ఉడాయిస్తున్నారు?
ABN , First Publish Date - 2021-11-24T05:21:41+05:30 IST
కామారెడ్డి జిల్లా కేంద్రంలో మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ముద్ర కార్యాలయం మూత పడినట్లు సమాచారం.
చిట్ఫండ్, లక్కీడ్రా, డిపాజిట్ కంపెనీల మోసాలు
అమాయక ప్రజలను నిలువునా ముంచుతున్న వైనం
కామారెడ్డి, నవంబరు 23: కామారెడ్డి జిల్లా కేంద్రంలో మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ముద్ర కార్యాలయం మూత పడినట్లు సమాచారం. గత మూడు నెలలుగా కార్యాలయానికి తాళం వేసి ఉండడంతో అందులో డబ్బులు డిపాజిట్ చేసిన వారు ఆందోళనకు గురవుతున్నారు. గత కొద్దిరోజులుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ తరహ మూసివేతలు ఎక్కువగా జరుగుతున్నాయి. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న చిట్ఫండ్ కంపెనీలు, లక్కీడ్రాలు, డిపాజిట్ల కార్యాలయాలు చెప్పాపెట్టకుం డా రాత్రికి రాత్రి బిచాన ఎత్తివేస్తున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ చిట్ఫండ్ కంపెనీలో గత కొద్దిరోజుల క్రితం చీటీలు వేసిన వారికి డబ్బులు ఇవ్వకపోవడంతో వారు అంతా వచ్చి పెద్ద ఎత్తున కార్యాలయానికి వచ్చి ఆందోళన నిర్వహించారు. దీంతో సదరు చిట్ఫండ్ కంపెనీ నిర్వాహకులు కార్యాలయాన్ని మూసివేశారు. పాత ఎన్హెచ్ 7 రోడ్డులో నెల వాయి దాల పేరుతో డిపాజిట్లు చేయించుకుని సమయం ముగిసినా వారికి డబ్బులు ఇచ్చేందుకు నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇక లక్కీడ్రా వ్యవహారం చెప్పనక్కరలేదు. ఇందులో ఏకంగా ప్రజాప్రతినిధులు వారి బినామీలు ఏజెంట్లను నియమించి అమాయక ప్రజల నుంచి డబ్బులు కట్టించి వారికి ఏగనామం పెడుతున్నారు. ఇలా నిత్యం జిల్లా కేంద్రంలో ఏదో ఒకచోట మోసాలు బయటపడుతున్న పోలీసు వ్యవస్థ దృష్టిసారించకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.