CM Jaganmohan Reddy : జయహో.. భయహో!

ABN , First Publish Date - 2022-12-08T02:18:02+05:30 IST

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీ పెద్దలు కొన్నాళ్లుగా ‘బీసీ జపం’ చేస్తున్నారు. ఇదే క్రమంలో...

CM Jaganmohan Reddy : జయహో.. భయహో!

సభ సాక్షిగా వైసీపీకి జై కొట్టని బీసీలు

అనుకున్నదానిలో సగం కూడా రాని జనం

జగన్‌ ప్రసంగానికి కనిపించని స్పందన

సీఎం స్పీచ్‌ మొదలుకాగానే బయటికి

గుంపులు గుంపులుగా గేట్ల వైపు

తాళ్లు, బారికేడ్లు పెట్టి ఆపిన పోలీసులు

అయినా ఆగకుండా రోడ్డెక్కిన జనం

సభను ఖాళీ చేసి.. భోజనశాల వద్ద కిక్కిరిసి!

సీఎంవెళ్లేదాకా వడ్డన మొదలుపెట్టని వైనం

ఆంక్షలతో సాధారణ ప్రజలకు అష్టకష్టాలు

యుద్ధానికి సిద్ధమవ్వండి.. జగన్‌ పిలుపు

వందలకొద్దీ బస్సులు వేసి... విందుల పేరిట ఊరించి... బోన్‌సగా మందు కూడా ఇచ్చి... ఎండ తగలకుండా టెంట్లు వేసి... చక్కటి కుర్చీల్లో కూర్చోబెట్టినా... ఏమాత్రం ఫలితం దక్కలేదు! ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రసంగాన్ని బీసీలు ఏమాత్రం పట్టించుకోలేదు. ‘ఇక్కడున్న 80 వేల మంది’ అని జగన్‌ గొప్పగా చెబుతుండగానే.. ముందున్న గ్యాలరీలు మినహా వెనుకవైపు కుర్చీలన్నీ దాదాపుగా ఖాళీ అయిపోయాయి. వెరసి... బీసీలకు ఎంతో చేశామని చెప్పుకొని, వారి ఓట్లకు గేలం వేసేందుకు వైసీపీ పెద్దలు ఏర్పాటు చేసిన ‘జయహో సభ’ విఫలమైంది. ఆశించిన వారిలో సగం మంది కూడా రాకపోవడం ఒక ఎత్తైతే... వచ్చిన వారిలో మూడొంతులకుపైగా జనం జగన్‌ ప్రసంగిస్తుండగానే కుర్చీల్లోంచి లేవడం మరో ఎత్తు!

(విజయవాడ - ఆంధ్రజ్యోతి): ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీ పెద్దలు కొన్నాళ్లుగా ‘బీసీ జపం’ చేస్తున్నారు. ఇదే క్రమంలో... బుధవారం విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న ఇందిరాగాంధీ స్టేడియంలో ‘జయహో బీసీ’ పేరిట సదస్సు ఏర్పాటు చేశారు. ఎంజీ రోడ్డుపైకి వాహనాలను అనుమతించకుండా... నగరమంతా ఆంక్షలు పెట్టి ప్రజలను అష్టకష్టాలకు గురి చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి వందల సంఖ్యలో బస్సులు వేసి కార్యకర్తలను, జనాలను విజయవాడకు తరలించారు. 80వేల మందితో ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలకున్నారు. కానీ అందులో సగంమంది కూడా రాలేదు. మొత్తంగా 25వేల నుంచి 30వేల మందిని సమీకరించగలిగామని వైసీపీ నేతలే పేర్కొన్నారు.

కనిపించని స్పందన

బుధవారం ఉదయం 9 గంటలకే ‘జయహో బీసీ’ సభ ప్రారంభమైంది. తొలుత వైసీపీ బీసీ నేతలు, రాష్ట్ర మంత్రులు ప్రసంగించారు. అసలు ఉద్దేశాన్ని మరిచిపోయి... జగన్‌ను పొగడటం, చంద్రబాబును తిట్టడానికే పరిమితమయ్యారు. దీంతో సభకు వచ్చిన వారిలో పెద్దగా స్పందన కనిపించలేదు. ఇక... ముఖ్యమంత్రి జగన్‌ మధ్యాహ్నం 12.15 గంటలకు వేదికపైకి వచ్చారు. ఆ సమయంలో మంత్రి సీదిరి అప్పలరాజు ప్రసంగిస్తున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే జగన్మోహన్‌ రెడ్డి మైకు అందుకున్నారు. అదేమిటో, ఎందుకో తెలియదుగానీ... అప్పటిదాకా బాగానే కూర్చున్న జనం ఒక్కసారిగా కుర్చీల్లోంచి లేచి కదిలారు. అన్నలకూ, అక్కలకూ, చెల్లెమ్మలకూ... అంటూ జగన్‌ స్పీచు మొదలుపెట్టిన నిమిషాల్లోనే బయటికి దారి తీశారు. స్టేడియం బయట, రోడ్డు చివర ఉండే ఒక పాఠశాలలో ఏర్పాటు చేసిన భోజన శాల వైపు గుంపులు గుంపులుగా కదిలారు. జగన్‌ మైకు పట్టకముందు సభా స్థలిలో సుమారు 25వేల మంది ఉన్నారు. ఆ తర్వాత శరవేగంగా సభా ప్రాంగణమంతా పలుచబడి ఐదారువేల మంది మాత్రమే మిగిలారు. జగన్‌ ఇదేమీ పట్టించుకోకుండా... ‘‘ఇక్కడున్న 80వేల మంది నా బీసీ, నా ఎస్టీ, నా ఎస్సీ, నా మైనార్టీ అన్నలు, తమ్ముళ్లతో సభాప్రాంగణం జనసముద్రంలా కనిపిస్తోంది’’ అంటూ స్పీచు దంచి కొడుతూనే ఉన్నారు.

ఆగం... ఆగం...

బహిరంగ మైదానాల్లో నుంచి జనం వెళ్లకుండా అడ్డుకోవడం కష్టం! స్టేడియంలో అయితే, చక్కగా గేట్లు మూసేసి అడ్డుకోవచ్చు! వైసీపీ నేతలు ఈ వ్యూహంతోనే ‘జయహో బీసీ’ సభకు ఇందిరాగాంధీ స్టేడియంను ఎంచుకున్నారు కాబోలు! కానీ ఈ వ్యూహం ఫలించలేదు. గ్యాలరీల్లో కూర్చున్న వారిని మాత్రం పోలీసులు అడ్డుకోగలిగారు. మూత్ర విసర్జనకు పోవాలని బతిమలాడిన వారినీ పంపించలేదు. కానీ మైదానంలో ఉన్న వారిని ఆపడం వారికి సాధ్యం కాలేదు. భోజనాలు పెట్టడం మొదలుపెడితే... అందరూ అటువైపు వెళతారనే ఉద్దేశంతో, సీఎం వెళ్లేదాకా వడ్డన మొదలుపెట్టలేదు. అయినా... జనం పోలోమంటూ భోజనశాలవైపు కదిలారు. సభాప్రాంగణం శరవేగంగా ఖాళీ అవుతుండటంతో స్టేడియం నుంచి ఎవరినీ బయటకు వెళ్లనివ్వద్దని పోలీసులకు సూచించారు. పోలీసులు తాళ్లు, బారికేడ్లతో జనాన్ని కట్టడి చేసే పనిలో పడ్డారు. గంటపాటు సీఎం ప్రసంగం కొనసాగింది. తొలి 20 నిమిషాల్లోనే వేలాదిమంది బయటికి వచ్చేశారు. స్టేడియం ద్వారాల వద్ద పోలీసులు అడ్డుకున్నా ఫలితంలేకపోయింది. ఒక్కసారిగా వేలాది మంది రోడ్లపైకి రావడంతో... ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పరిస్థితి చక్కదిద్దేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. ఇక భోజనాల వద్దా తీవ్ర గందరగోళం, తొక్కిసలాట పరిస్థితి చోటు చేసుకుంది. సొంత పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సభలోనే పరిస్థితి ఇలా ఉండటమేమిటని వైసీపీ నేతలు తలలు పట్టుకున్నారు.

Updated Date - 2022-12-08T03:41:44+05:30 IST