అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళిని అడ్డుకున్నందుకు....

ABN , First Publish Date - 2022-11-26T23:46:57+05:30 IST

రామకుప్పం పట్టణంలోని శివాజీనగర్‌, రెడ్డివీధి కూడలిలో శనివారం ఉద్రిక్త పరిస్థితిలు నెలకొన్నాయి. అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాల వేసే వరకు తాము ఆందోళన విరమించేది లేదని భీష్మించారు.

అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళిని అడ్డుకున్నందుకు....
అంబేద్కర్‌ విగ్రహం, ఉయ్యాలవాడ శిలాఫలకాల వద్ద కుప్పం సీఐ రియాజ్‌అహ్మద్‌, రామకుప్పం ఎస్‌ఐ ఉమామహేశ్వరరెడ్డి

రామకుప్పం, నవంబరు 26: పట్టణంలోని శివాజీనగర్‌, రెడ్డివీధి కూడలిలో శనివారం ఉద్రిక్త పరిస్థితిలు నెలకొన్నాయి. అక్కడి అంబేడ్కర్‌ విగ్రహం, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి శిలాఫలకం ప్రాంతంలో ఏడాదిగా నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. అయితే రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాస్‌ నేతలు, శివాజీనగర్‌వాసులు అంబేడ్కర్‌కు నివాళి అర్పించేందుకు ఉపక్రమించారు. విగ్రహం ఉన్న ప్రాంతంలో నిషేధాజ్ఞలు ఉన్నాయని తమకు సహకరించాలని పోలీసులు కోరారు. ఇటీవల ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి రోజు కూడా శిలాఫలకానికి నివాళి అర్పించడానికి అనుమతించని విషయాన్ని ప్రస్తావించారు. దీంతో బాస్‌ నేతలు, కాలనీ వాసులు రామకుప్పం-విజలాపురం రహదారిలో రాస్తారోకో చేశారు. అనంతరం మండల సచివాలయం వద్దకు చేరుకుని అక్కడ బైఠాయించారు. తహసీల్దారు అందుబాటులో లేకపోవడంతో శివాజీనగర్‌, రెడ్డివీధి కూడలికి చేరుకుని ధర్నాకు దిగారు. కుప్పం గ్రామీణ, అర్బన్‌ సీఐలు రియాజ్‌అహ్మద్‌, శ్రీధర్‌, రామకుప్పం, రాళ్ళబూదుగూరు, కుప్పం, వి.కోట ఎస్‌ఐలు ఉమామహేశ్వరరెడ్డి, మునస్వామి, రామలక్ష్మణరెడ్డి, రాంభూపాల్‌ సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళన విరమించాలని కోరగా వారు ససేమిరా అన్నారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాల వేసే వరకు తాము ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. రాత్రి పొద్దుపోయే వరకు పోలీసులు వారితో చర్చించారు. ఎట్టకేలకు రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఆందోళన విరమించారు. పోలీసుల సూచనల మేరకు నిషేధిక ప్రాంతానికి కొద్ది దూరంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం చిత్రపటాన్ని బాణసంచా పేలుళ్లు, డప్పుల హోరు మధ్య గ్రామంలో ఊరేగించారు.

Updated Date - 2022-11-26T23:47:02+05:30 IST