అంతా మా ఇష్టం..!
ABN , First Publish Date - 2022-09-10T06:11:34+05:30 IST
అంతా మా ఇష్టం..!
మచిలీపట్నం అధికార పార్టీలో ముసలం
కార్పొరేటర్లను పక్కనపెట్టి పేర్ని నాని, కిట్టూ పెత్తనం
అంతా తండ్రీ తనయుల చిత్తం
రాజీనామాకు సిద్ధమవుతున్న కార్పొరేటర్లు
కులపెద్దలు సముదాయించడంతో తాత్కాలిక బ్రేక్
చిన్న కృష్ణుడి అతిజోక్యమే ప్రధాన కారణం
తండ్రీ తనయుడి పెత్తనం మచిలీపట్నం అధికార పార్టీలో ముసలానికి తెరలేపింది. ఇద్దరూ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తుండటంతో అధికార పార్టీకి చెందిన ద్వితీయశ్రేణి నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. కార్పొరేటర్లు, సర్పంచ్ల మాటకు విలువ ఇవ్వకుండా చిన్న కృష్ణుడి పెత్తనం పెరిగిపోవడం, బీసీ సామాజికవర్గానికి చెందిన కార్పొరేటర్లకు విలువ ఇవ్వకపోవడం, చులకనభావంతో చూస్తుండటంతో వివాదాలు ఒక్కసారిగా ముదిరి పాకాన పడుతున్నాయి.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : మాజీమంత్రి పేర్ని నాని కుమారుడు కిట్టూ పెత్తనమే మచిలీపట్నం అధికార పార్టీలో ముసలానికి కారణం. కిట్టూ అన్నీ తానై నడిపిస్తుండటంతో కార్పొరేటర్లకు విలువ తగ్గింది. ప్రతి పనీ తమ దృష్టికి తెచ్చాకే చేయాలని అధికారులను ఎమ్మెల్యే పేర్ని నాని, కిట్టూ ఆదేశిస్తున్నారు. ఏదైనా పని చేయాలని కార్పొరేటర్లు అధికారులను కోరితే, తండ్రీ తనయులకు ఓ మాట చెప్పాలని సూచిస్తున్నారు. దీంతో తక్షణమే చేపట్టాల్సిన పనుల్లో జాప్యం జరుగుతోంది.
కార్పొరేటర్లలో అసంతృప్తి
- మచిలీపట్నానికి సింహద్వారం వైపున ఉన్న ఓ డివిజన్లో 310 మందికి కరగ్రహారంలోని జగనన్న లే అవుట్లో ఇళ్ల స్థలాలిచ్చారు. వీరిలో 90 మందికే పట్టాలు చెందికందాయి. మిగిలిన 218 మందికి కేటాయించిన భూమి కోర్టు కేసులో ఉందని ట్యాగింగ్ చేయలేదు. స్థలాలూ చూపలేదు. దీంతో ఆ డివిజన్ లబ్ధిదారులంతా కార్పొరేటర్ చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయాన్ని సదరు కార్పొరేటర్ పదేపదే ఎమ్మెల్యే పేర్ని నానీకి విన్నవించినా ఫలితం లేదు. దీంతో ఆ కార్పొరేటర్ తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. పార్టీలోని తన సహచర నాయకులకు తెలియజేశారు. ఇది సమయం కాదని, కొద్దిరోజులు వేచి చూడాలని వారంతా సర్దిచెప్పారు. దీంతో కులపెద్దల నిర్ణయం కోసం ఆ కార్పొరేటర్ వేచిచూస్తున్నారు.
- మరో కార్పొరేటర్ అయితే తన కుటుంబాన్ని పొరుగున ఉన్న జిల్లాకు మార్చి తనదైనశైలిలో నిరసన తెలియజేస్తున్నారు. వైసీపీ ప్రారంభం నుంచి ఉన్న ఒక నాయకుడికి సంబంధించిన ఇంటిని బార్ అండ్ రెస్టారెంట్కు నెలకు రూ.లక్షకు పైగా అద్దె వచ్చేలా మాట్లాడుకున్నారు. అయితే, ఈ ఇంటిని అద్దెకు ఇవ్వనీయకుండా నియోజకవర్గ అధినాయకుడు తెరవెనుక చక్రం తిప్పాడు. ఈ విషయం కూడా పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
కొడుకు చాటు పిన్ని..
మచిలీపట్నం.. మునిసిపాలిటీ స్థాయి నుంచి కార్పొరేషన్గా మార్పు చెందాక తొలి మేయర్గా మోకా వెంకటేశ్వరమ్మను కూర్చోబెట్టారు. అధికార దర్పం కోసం ఓ కారు ఇచ్చారు. అయితేనేం.. మచిలీపట్నం మేయర్ పదవి అలంకారప్రాయమే. ‘కొడుకు చాటు పిన్నిలా’ ఈ మేయర్ పదవిలో కొనసాగుతున్నారు. మేయర్ హోదాలో ఆమె అనేక కార్యక్రమాల్లో మొక్కుబడిగా పాల్గొంటూ, ఎమ్మెల్యే సూచనల మేరకేమాట్లాడి సరిపుచ్చుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీలో చాపకింద నీరులా నెలకొన్న విభేదాలు రానున్న రోజుల్లో ఎన్ని మలుపులు తిరుగుతాయోనని బందరువాసులు చర్చించుకుంటున్నారు.
ఇష్టం ఉంటే ఉండండి, పోతే పొండి : పదేపదే ఇదే మాట..!
ఇటీవల మాచవరంలో పార్టీ అంతర్గత సమావేశం నిర్వహించారు. 20 మందికి పైగా కార్పొరేటర్లు, ఇతర ద్వితీయశ్రేణి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు, కార్యకర్తలు మాట్లాడుతూ అధికారంలో ఉన్నా అధికారులతో ఒక్క పనీ చేయించుకోలేకపోతున్నామని, డివిజన్లలో ప్రజల ఎదుట తలెత్తుకోలేకపోతున్నామని, ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని, తమకు కనీస గౌరవం దక్కేలా వ్యవహరించాలని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఎమ్మెల్యే పేర్ని నాని స్పందిస్తూ ‘పార్టీలో ఇష్టం ఉన్నవారు ఉండండి. లేకపోతే పొండి..’ అనడంతో సమావేశంలోని వారంతా కంగుతిన్నారు. ‘అందరం కలిస్తేనే పార్టీ, ఆయన, ఆయన కుమారుడే కాదు కదా, అసలు వైసీపీలో కొనసాగాలా, వద్దా అనే విషయంపై సీఎం, లేదా సజ్జల రామకృష్టారెడ్డి వద్దే తేల్చుకుంటాం..’ అనే ఆలోచనలో కొందరు కార్పొరేటర్లు ఉన్నారు. పార్టీ అధినాయకత్వంతో మాట్లాడేందుకు అనుసం ధానకర్తను వెతికే పనిలో పడ్డారు. బీసీ నాయకులంతా ఒకతాటిపైకి వచ్చేందుకు మంత్రాంగం నడుపుతున్నారు.