పోర్టు మాకొద్దు
ABN , First Publish Date - 2022-04-24T04:57:09+05:30 IST
‘మా గ్రామంలో పోర్టు నిర్మించొద్దు. పచ్చని బతుకుల్లో చిచ్చు పెట్టొద్దు’ అని మూలపేట వాసులు రెవెన్యూ అధికారులకు స్పష్టం చేశారు. పోర్టు నిర్మాణం విషయమై శనివారం తహసీల్దార్ ఆధ్వర్యంలో అధికారులు గ్రామసభ నిర్వహించారు.
- గ్రామసభలో తేల్చిచెప్పిన మూలపేట వాసులు
సంతబొమ్మాళి, ఏప్రిల్ 23: ‘మా గ్రామంలో పోర్టు నిర్మించొద్దు. పచ్చని బతుకుల్లో చిచ్చు పెట్టొద్దు’ అని మూలపేట వాసులు రెవెన్యూ అధికారులకు స్పష్టం చేశారు. పోర్టు నిర్మాణం విషయమై శనివారం తహసీల్దార్ ఆధ్వర్యంలో అధికారులు గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మూలపేట గ్రామస్థులు మాట్లాడుతూ.. ‘ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలోని తంపరలో పీతలు, జెళ్లలు, బొంతలు మొదలగు చేపల వేట సాగిస్తున్నాం. జీడితోటలు కూడా సాగు చేస్తూ.. జీవిస్తున్నాం. పచ్చని పొల్లాల్లో పోర్టు నిర్మించి మా పొట్టలు కొట్టొద్దు. ఈ ప్రాంతంలో పోర్చు నిర్మించవద్దు’ అని తేల్చిచెప్పారు. 2014 నుంచి భావనపాడులో పోర్టు నిర్మిస్తామని ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి.. ఇప్పుడు మూలపేటలో నిర్మిస్తామని చెప్పడంలో మర్మమేమిటని ప్రశ్నించారు. మూలపేటలో ఉన్న 300 ఎకరాలు పోర్టుకు ఎలా ఉపయోగపడుతుందన్నారు. ఇప్పుడిప్పుడే గ్రామంలో రవాణా, ఇతర సౌకర్యాలు మెరుగుపడుతున్నాయని, ఈ తరుణంలో పోర్టు పేరిట తమను ఇతర ప్రాంతాలకు తరలిస్తే ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. భావనపాడు నుంచి మూలపేటకు పోర్టు మార్పుపై కలెక్టర్ ద్వారా తమకు తీర్మానం అందజేయాలని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని మాజీ సర్పంచ్, మండల టీడీపీ అధ్యక్షుడు జీరు బీమారావు తెలిపారు. ప్రజాభీష్టం మేరకు తాము నడుస్తామని సర్పంచ్ జీరు బాబూరావు, ఎంపీటీసీ ప్రతినిధి నక్క బీమారావులు స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తహసీల్దార్ చలమయ్య తెలిపారు. సమావేశంలో డీటీ పద్మావతి, ఆర్.ఐ.రాధాకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు.