రైతు కుటుంబానికి యాదవ సంఘం అండ
ABN , First Publish Date - 2022-11-11T03:25:55+05:30 IST
కోర్టు పరిధిలో ఉన్న భూమికి అధికారులు ప్రహరీ ఎలా ఏర్పాటు చేస్తారని శ్రీసత్యసాయి జిల్లా యాదవ సంఘం నాయకులు ప్రశ్నించారు.
అధికారుల తీరును నిరసిస్తూ బైఠాయింపు
హిందూపురం, నవంబరు 10: కోర్టు పరిధిలో ఉన్న భూమికి అధికారులు ప్రహరీ ఎలా ఏర్పాటు చేస్తారని శ్రీసత్యసాయి జిల్లా యాదవ సంఘం నాయకులు ప్రశ్నించారు. ‘పొలానికి దారి మూశారు’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో గురువారం ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు. సోమందేపల్లి మండలం కావేటినాగేపల్లి సమీపంలో రైతు రామయ్య కుటుంబాన్ని బయటకు పంపించి, వారి పొలాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. హిందూపురం-గోరంట్ల ప్రధాన రహదారిపై రామయ్య పొలం వద్ద యాదవ సంఘం ఆధ్వర్యంలో గురువారం బైఠాయించి నిరసన తెలిపారు. నాసిన్ సంస్థకు భూమిని ఇచ్చేందుకు రైతు సమ్మతించలేదని, న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాడని.. న్యాయస్థానంలో కేసు నడుస్తుండగా అధికారులు కంచె ఎలా ఏర్పాటుచేస్తారని ప్రశ్నించారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు రామయ్య కుటుంబంపై కక్షగట్టారని మండిపడ్డారు. పోలీ్సస్టేషన్లు చుట్టూ రాత్రంతా తిప్పుతూ బాధిత కుటుంబానికి నరకం చూపించారని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే రైతు కుటుంబానికి న్యాయం చేయాలని.. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అనంతరం ధర్నా విరమించి పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం సమర్పించారు.