మునుగోడులో టీఆర్‌ఎస్‌, బీజేపీలకు గుణపాఠం చెప్పాలి: జానారెడ్డి

ABN , First Publish Date - 2022-10-23T21:09:07+05:30 IST

మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలను ఓడించి గుణపాఠం చెప్పాలని సీఎల్పీ మాజీ నేత కందూరు జానారెడ్డి అన్నారు.

మునుగోడులో టీఆర్‌ఎస్‌, బీజేపీలకు గుణపాఠం చెప్పాలి: జానారెడ్డి

నాంపల్లి: మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలను ఓడించి గుణపాఠం చెప్పాలని సీఎల్పీ మాజీ నేత కందూరు జానారెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలోని సుంకిశాల, ముష్టిపల్లి, మేళ్లవాయి, పసునూరు గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతిరెడ్డిని గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అహంకారానికి, నీతి, నిజాయితీకి మధ్య ఉపఎన్నిక జరుగుతోందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజల గుండెల్లో ఉందని, చెయ్యి గుర్తుపై గెలిచిన అభ్యర్థులు, పార్టీ మారిన కార్యకర్తలు ఎప్పుడూ కాంగ్రెస్‌ వెంటే ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌ డిండి ప్రాజెక్టును పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు. మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి చెందిందన్నారు. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మంత్రిగా మునుగోడు అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన వారసురాలు పాల్వాయి స్రవంతిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Updated Date - 2022-10-23T21:09:10+05:30 IST