AAP National Party : ఆప్‌.. జాతీయ పార్టీ

ABN , First Publish Date - 2022-12-09T01:58:29+05:30 IST

కేవలం పదేళ్లు.. ఢిల్లీ గల్లీలో పుట్టిన ఓ పార్టీ ‘జాతీయ హోదా’ స్థాయికి ఎదిగింది. పలు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా పాతుకుపోయి సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న చాలా ప్రాంతీయ పార్టీలకు సాధ్యం కాని ఘనతను అతి తక్కువ వ్యవధిలోనే సాధించింది. దేశ రాజధాని దాటి బయటకు వచ్చి..

 AAP National Party : ఆప్‌.. జాతీయ పార్టీ

పదేళ్ల వ్యవధిలోనే పలు రాష్ట్రాలకు విస్తరణ

ఢిల్లీ, పంజాబ్‌లో అధికారం.. గోవాలో పాగా

గుజరాత్‌ బరిలో తొలిసారే 12 శాతం ఓట్లు

మోదీ, షా హవాను ఎదుర్కొని మరీ సత్తా

ప్రజాకర్షక స్కీములు.. సాఫ్ట్‌ హిందుత్వ బాట

సుపరిచిత కేజ్రీవాల్‌ ముఖచిత్రంతో ముందుకు

(సెంట్రల్‌ డెస్క్‌)

కేవలం పదేళ్లు.. ఢిల్లీ గల్లీలో పుట్టిన ఓ పార్టీ ‘జాతీయ హోదా’ స్థాయికి ఎదిగింది. పలు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా పాతుకుపోయి సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న చాలా ప్రాంతీయ పార్టీలకు సాధ్యం కాని ఘనతను అతి తక్కువ వ్యవధిలోనే సాధించింది. దేశ రాజధాని దాటి బయటకు వచ్చి.. పంజాబ్‌ను వశం చేసుకుని.. గోవాలో పాగా వేసి.. ఇప్పుడు గుజరాత్‌లోనూ ఉనికిని బలంగా చాటింది. తద్వారా దేశంలో 8వ జాతీయ పార్టీగా అవతరించింది. ఆ పార్టీ.. అరవింద్‌ కేజ్రీవాల్‌ సారథ్యంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌). గురువారం వెలువడిన గుజరాత్‌ ఎన్నికల ఫలితాల్లో ఆప్‌నకు 12.92 శాతం ఓట్లు వచ్చాయి. మోదీ, షా హవాను తట్టుకుని ఈస్థాయి ఓట్లు సాధించడం సాధారణమైన విషయం కాదు. అంతేకాదు.. ఈ ఓట్లు ఆప్‌కు జాతీయ హోదా కూడా తెచ్చిపెట్టడం విశేషం. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం.. ఒక పార్టీని జాతీయ పార్టీగా గుర్తించాలంటే.. ఆ పార్టీ కనీసం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొంది ఉండాలి; లేదా నాలుగు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల్లో జరిగిన లోక్‌సభ/అసెంబ్లీ ఎన్నికల్లో 6ు అంతకన్నా ఎక్కువ సీట్లు సాధించి ఉండాలి; గత సాధారణ ఎన్నికల్లో లోక్‌సభలోని మొత్తం స్థానాల్లో 2ు శాతం సీట్లలో కనీసం మూడు రాష్ట్రాల నుంచి గెలుపొంది ఉండాలి. వీటిలో మొదటి రెండు నిబంధనల ద్వారా ఆప్‌ జాతీయ పార్టీ అయ్యింది. ఢిల్లీలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన ఆప్‌.. ఈ ఏడాది ప్రారంభంలో పంజాబ్‌ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించింది. గోవాలో రెండు సీట్లలో నెగ్గి, 6.77 శాతం ఓట్లు తెచ్చుకుంది. ఇప్పుడు గుజరాత్‌లో 5 స్థానాల్లో గెలుపొందింది. అంటే నాలుగు రాష్ట్రాల్లో సత్తా చాటి జాతీయ పార్టీ స్థాయికి ఎదిగింది. కాగా, బీజేపీ, కాంగ్రెస్‌, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, టీఎంసీ.. ఇప్పటివరకు దేశంలో జాతీయ హోదా ఉన్న పార్టీలివి. తాజాగా ఆప్‌ వీటి సరసన 8వ పార్టీగా చేరింది. అయితే, బీజేపీ, కాంగ్రెస్‌ మినహా బలబలాల రీత్యా మిగతావాటిలో కొన్ని జాతీయ హోదాను కోల్పోయే ముప్పును ఎదుర్కొంటున్నాయి.

బీజేపీతో తెలివిగా..

ఉత్తరాదిలో బీజేపీని ఎదుర్కొనాలంటే హిందూత్వంపై ఏ పార్టీ అయినా వైఖరి చెప్పాల్సిందే. ఇదే అంశంపై గుజరాత్‌ ఎన్నికల ముంగిట ఇరుకునపెట్టాలని చూసినా ఆప్‌ తెలివిగా తిప్పికొట్టింది. సాక్షాత్తు కేజ్రీవాలే.. ‘‘కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి బొమ్మ’’లను ముద్రించాలన్న డిమాండ్‌తో బీజేపీకి షాకిచ్చారు. ఇదే ఆప్‌.. దేశ సమగ్రత, భద్రతకు సంబంధించిన ప్రధాన అంశమైన ఆర్టికిల్‌ 370 రద్దుతో పాటు అయోధ్యలో రామ మందిర నిర్మాణం వంటి వాటిపై మాత్రం మెజార్జీ ప్రజల మనోభావాలకు తగినట్లుగా వ్యవహరించింది. అయోధ్యలో ఆలయం పూర్తయితే ఉచిత సందర్శనకు ఏర్పాట్లు చేస్తామని కేజ్రీ ప్రకటించడం ఈ కోవలోకేదే. అయితే, తటస్థ వైఖరిని వీడకుండానే, అవసరమైన సందర్భంలో హిందూత్వపై గళమెత్తుతూ ఆప్‌ ముందుకెళ్తోంది.

సంక్షేమ జపం

యువతకు ఉద్యోగాలు, మెరుగైన విద్య, వైద్యం వీటికితోడు ఉచిత విద్యుత్తు పంజాబ్‌లో ఆప్‌ను గెలిపించిన హామీలివి. పరిస్థితులను సరిగ్గా అంచనా వేసి ఇచ్చిన హామీలతో సూపర్‌ హిట్‌ కొట్టింది. ఇవే పథకాలను ఢిల్లీలో అమలు చేసి కేజ్రీవాల్‌ సర్కారు విజయవంతమైంది. మరీ ముఖ్యంగా ఢిల్లీలో పాఠశాలలను ఆప్‌ సర్కారు బోధనలో, వసతుల్లో అత్యున్నతంగా తీర్చిదిద్దిన తీరు ప్రశంసలు అందుకుంది. ఇక మొహల్లా క్లినిక్‌ల పేరిట వైద్యాన్ని సాధారణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చి భేష్‌ అనిపించుకుంది. గుజరాత్‌లోనూ ఉచిత విద్య, విద్యుత్‌ హామీలతో ముందుకెళ్లింది. పంజాబ్‌ సీఎం భగవంత్‌సింగ్‌ మాన్‌ ఏకంగా తమ రాష్ట్రంలో ఉచిత విద్యత్‌ అమలుతో ప్రజలు పొందుతున్న ప్రయోజనాన్ని వివరిస్తూ గుజరాత్‌లో విస్తృతంగా ప్రచారం చేశారు. అలాగే.. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం.. చాపకింద నీరులా పనిచేసుకుపోవడం.. పక్కా ప్రచారం.. సీఎం అభ్యర్థిని సర్వేల ద్వారా ప్రకటించడం ఆప్‌ శైలి. ఉదాహరణకు 2019 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో సంగ్రూర్‌ సీటును మాత్రమే ఆ పార్టీ గెల్చుకుంది. కానీ, అకాలీదళ్‌, కాంగ్రెస్‌ దశాబ్దాల పాలనతో ప్రజలు విసిగిపోయారని ప్రత్యామ్నాయంగా తమకు మంచి అవకాశాలు ఉన్నట్లు కేజ్రీ అంచనా వేశారు. వాలంటీర్ల ద్వారా ఏ అంశాలు ప్రభావితం చేస్తాయో గుర్తించి.. విజయం సాధించారు.

మధ్య తరగతి మఫ్లర్‌ మ్యాన్‌

మఫ్లర్‌ మ్యాన్‌గా పిలుచుకునే కేజ్రీవాలే.. ఆప్‌నకు అన్నీ. ముక్కుసూటిగా.. చాలా సరళంగా, ప్రత్యర్థులపై అనవసర విమర్శలకు తావివ్వకుండా, తాము ఏం చేస్తామో చెబుతూ సాగే ఆయన ప్రసంగాలు ప్రజలను ఆలోచనలో పడేస్తాయి. జన్‌ లోక్‌పాల్‌ ఆందోళనలతో దేశమంతటికీ పరిచయమైన కేజ్రీ.. 2015లో ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుతో సీరియస్‌ రాజకీయవేత్తగా మారారు. అదే ఊపుతో మరోసారీ గెలిచి.. పంజాబ్‌నూ ఒడిసిపట్టి సంచలనం రేపారు. ఇప్పుడు ఉత్తర భారతదేశం మొత్తానికీ కేజ్రీవాల్‌ అంటే ఓ ప్రభావవంతమైన వ్యక్తి. ఆప్‌.. ఇదే దూకుడును వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌, మధ్యప్రదేశ్‌లోనూ చూపినా ఆశ్చర్యం లేదు.

Updated Date - 2022-12-09T01:58:30+05:30 IST