ISRO : ద్వైపాక్షిక సంబంధాల్లో చారిత్రక విజయం : జైశంకర్

ABN , First Publish Date - 2022-11-26T19:12:49+05:30 IST

పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (PSLV) మిషన్, 2022 విజయవంతమవడంతో భారత్-భూటాన్ చారిత్రక

ISRO : ద్వైపాక్షిక సంబంధాల్లో చారిత్రక విజయం : జైశంకర్
ISRO

న్యూఢిల్లీ : పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (PSLV) మిషన్, 2022 విజయవంతమవడంతో భారత్-భూటాన్ చారిత్రక మైలురాయిని చేరుకున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ (Dr. Subrahmanian Jaishankar) చెప్పారు. ఇరు దేశాలు రోదసి సాంకేతిక పరిజ్ఞానాన్ని, దాని అనువర్తన (Application)లను ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఉపయోగించుకోవాలన్నారు. ఇస్రో మిషన్ కంట్రోల్ సెంటర్‌లోని శాస్త్రవేత్తలను ఉద్దేశించి ఆయన శనివారం టెలివైజ్డ్ ప్రసంగం చేశారు.

PSLV-C54/EOS-06 శనివారం తొమ్మిది ఉపగ్రహాలను ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీహరి కోట, సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా ప్రయోగించింది. వీటిలో ఒకటి భూమిని పరిశీలించే ఉపగ్రహం కాగా, ఎనిమిది కో-ప్యాసింజర్ శాటిలైట్లు. వీటిలో ఒకటైన ఇండియా-భూటాన్ శాటిలైట్‌ను ఇరు దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. భూటాన్ ఇంజినీర్లకు బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో శాటిలైట్ బిల్డింగ్, టెస్టింగ్‌లలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. శాటిలైట్ డేటాను ప్రాసెస్ చేయడం, విశ్లేషించడంలో కూడా శిక్షణ ఇచ్చారు. దీంతో భూటాన్ కోసం ఆ దేశానికి అవసరమైనవిధంగా ఉపగ్రహాన్ని సంయుక్తంగా అభివృద్ధి చేయడం సాధ్యమైంది.

ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలను ఉద్దేశించి జైశంకర్ చేసిన టెలివైజ్డ్ అడ్రస్‌లో, భారతీయులు భూటాన్ ఇంజినీర్లకు కెపాసిటీ బిల్డింగ్‌లో సహాయపడ్డారని చెప్పారు. బెంగళూరులోని ఇస్రో, యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ చిన్న ఉపగ్రహాల నిర్మాణం, పరీక్షల నిర్వహణ, శాటిలైట్ డేటా ప్రాసెసింగ్, విశ్లేషణలలో వీరికి శిక్షణనిచ్చిందన్నారు. ఇప్పుడు ఇరు దేశాలు కలిసి భూటాన్ కోసం ఐఎన్ఎస్-2బీ కస్టమైజ్డ్ స్మాల్ శాటిలైట్‌ను అభివృద్ధిపరచడం చాలా గొప్ప విషయమని తెలిపారు. ఈ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించినందుకు ఇరు దేశాల శాస్త్రవేత్తలను అభినందించారు. ప్రత్యేక మిత్రులుగా, పొరుగువారిగా భూటాన్‌తో భారత దేశ ద్వైపాక్షిక సహకారంలో చారిత్రక మైలురాయిని చేరుకున్నామన్నారు. ఇస్రో, భూటానీస్ రోదసి, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలతో కూడిన బృందాలు రెండేళ్ళపాటు పరస్పర సహకారంతో చేసిన కృషి నేడు భూటాన్ కోసం ఓ ఉపగ్రహాన్ని ప్రయోగించే స్థాయిలో విజయవంతమైందని చెప్పారు.

భూటాన్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ మంత్రి లియోన్పో కర్మ డొన్నెన్ వాంగ్డి నేతృత్వంలో అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందం శ్రీహరి కోటకు వచ్చింది. ఇండియా-భూటాన్ శాటిలైట్ ప్రయోగాన్ని వీక్షించింది. ఈ కార్యక్రమానికి భూటాన్ నుంచి 18 మందితో కూడిన మీడియా బృందం కూడా వచ్చింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) 2019 ఆగస్టులో భూటాన్‌లో పర్యటించారు. ఇస్రో సహకారంతో థింపూలో నిర్మించిన సౌత్ ఆసియా శాటిలైట్ గ్రౌండ్ ఎర్త్ స్టేషన్‌ను భూటాన్ నేతలతో కలిసి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ విషయాన్ని జైశంకర్ శనివారం గుర్తు చేశారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌జియెల్ వాంగ్‌చుక్, భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించినట్లుగా ఇండియా-భూటాన్ భాగస్వామ్యాన్ని ఇరు దేశాలు సరికొత్త శిఖరాలకు చేర్చినట్లు తెలిపారు. రోదసి, టెక్నాలజీ రంగాల్లో విజయాల ద్వారా 21వ శతాబ్దంలో సరికొత్త శిఖరాలకు చేర్చినట్లు తెలిపారు. సౌత్ ఆసియా శాటిలైట్‌ను 2017లో భారత దేశం ప్రారంభించిందని, దీనిని భూటాన్ సహా దక్షిణాసియా దేశాలకు బహుమతిగా ఇచ్చిందని తెలిపారు.

Updated Date - 2022-11-26T19:12:54+05:30 IST