CJI Justice Chandrachud : కులాంతర వివాహాలే బలిపీఠాలు!

ABN , First Publish Date - 2022-12-19T04:14:17+05:30 IST

కుటుంబాల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వేరే కులాలవారిని వివాహమాడుతున్నందుకు ఏటా వందల మంది హత్యలకు గురవుతున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఆవేదన

 CJI Justice Chandrachud : కులాంతర వివాహాలే బలిపీఠాలు!

ఏటా వందల పరువు హత్యలు.. చట్టాల్లోనూ వివక్షలు చొరబడుతున్నాయి

సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌

ముంబై, డిసెంబరు 18: కుటుంబాల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వేరే కులాలవారిని వివాహమాడుతున్నందుకు ఏటా వందల మంది హత్యలకు గురవుతున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. నైతికత విషయంలో బలహీన వర్గాలపై ప్రాబల్య వర్గాల ఆధిపత్యం ఉందని తెలిపారు. మతమార్పిడులకు వ్యతిరేకంగా యూపీ, మధ్యప్రదేశ్‌, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కఠిన చట్టాలు తీసుకొస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. గత నెలలో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్‌ చంద్రచూడ్‌ను శనివారమిక్కడ బాంబే హైకోర్టు సత్కరించింది. అనంతరం ‘చట్టం-నైతికత’ అన్న అంశంపై ఆయన అశోక్‌ దేశాయ్‌ స్మారక ప్రసంగం చేశారు. కులాంతర వివాహాలు బలిపీఠాలుగా మారుతున్నాయంటూ.. చట్టం, నైతికత, వర్గాల హక్కుల నడుమ విడదీయలేని దృఢబంధాన్ని ఈ సందర్భంగా వివరించారు. మన ప్రవర్తనను మలచడంలో చట్టం, నైతికత కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ‘సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ప్రాబల్యం ఉన్న గ్రూపులకు బలహీన వర్గాలపై ఆధిపత్యం ఉంది. రాజ్యాంగాన్ని రూపొందించుకున్నప్పటికీ.. చట్టం ఒకానొక నైతికతను రుద్దుతోంది. ఇది పురుషులు, అగ్రవర్ణాలు, పలుకుబడి కలిగిన వ్యక్తులు, ప్రాబల్య వర్గాల నైతికత. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో.. మెజారిటీ ఆధారంగా చట్టాలు ఆమోదం పొందుతాయి. అందుచేత మెజారిటీ ప్రజల నైతికతకు సంబంధించిన చర్చ ఆ చట్టాల్లో చేరిపోతోంది. చట్టం బాహ్య సంబంధాలను క్రమబద్ధీకరిస్తుంది. కానీ నైతికత అంతర్గత జీవితాన్ని, కోరికలను.. మన అంతరంగాన్ని, ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. నైతికత అనేది ప్రవర్తనా నియామవళిని నిర్దేశించే విలువల వ్యవస్థ అని మనమంతా అంగీకరిస్తాం. అయితే నాకు నైతికం అనిపించేది మీ అందరికీ నైతికంగా అనిపించడం అవసరమా అనేది ప్రశ్న. మన సామాజిక వ్యవస్థలో బలహీన వర్గాలను అట్టడుగున ఉంచారు. ఒకవేళ వారి అభిప్రాయాలు తీసుకున్నా.. వాటిని పరిగణనలోకి తీసుకుంటారనేది భ్రమే. ఈ ప్రాబల్య వర్గాలు సదరు బలహీనుల మర్యాదలు, ఆచార వ్యవహారాలపై దాడిచేస్తుంటాయి. వారికంటూ ప్రత్యేక గుర్తింపు సృష్టించుకోకుండా అడ్డుకుంటుంటాయి. ఉమ్మడి నైతికత పేరిట ఈ ప్రాబల్య శక్తులు రుద్దుతున్న సామాజిక నైతికతను అడ్డుకునేందుకు.. రాజ్యాంగంలో పొందుపరచిన విలువలపై మన దృష్టిని మళ్లించాల్సిన అవసరం ఉంది’ అని నొక్కిచెప్పారు. చట్టాల్లోనూ వివక్షలు చొరబడుతున్నాయని జస్టిస్‌ చంద్రచూడ్‌ వాపోయారు. సమాజంలోని కొన్ని వర్గాలకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఈ వివక్షలు ఉంటున్నాయని చెప్పారు. మహారాష్ట్రలో పుస్తకాలు, నాటకాలపై నిషేధం, డ్యాన్స్‌ బార్లపై ఆంక్షలను ఇందుకు ఉదాహరణలుగా పేర్కొన్నారు. ‘నైతికత పరిరక్షణ ముసుగులో.. చట్టం ఇచ్చిన అణచివేత శక్తితో రాజ్యాంగం ప్రసాదించిన భావ వ్యక్తీకరణ హక్కును నియంత్రించడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. అంటే చట్టపాలన జరిగే సమాజాల్లో కూడా చట్టానికి భాష్యం చెప్పడంలో, దానిని అమలు చేయడంలో నైతికత ప్రభావం మనకు కనబడుతోంది’ అని తెలిపారు. ప్రేమించినందుకు.. కుటుంబాల మనోగతానికి విరుద్ధంగా వేరే కులాలవారిని వివాహమాడుతున్నందుకు ఏటా వందల మందిని చంపుతున్నారని వ్యాఖ్యానించారు.

ఎమర్జెన్సీ కాలంలో..

ఎమర్జెన్సీ విధించిన కాలంలో స్వతంత్ర కోర్టులు నిర్భీతిగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాయని జస్టిస్‌ చంద్రచూడ్‌ గుర్తుచేశారు. 1975లో ఎమర్జెన్సీ విధింపుతో మసకబారిన స్వేచ్ఛాజ్వాలలను జస్టిస్‌ రాణే వంటి న్యాయమూర్తులు జ్వలించేలా చేశారని కొనియాడారు. న్యాయస్థానాలు, న్యాయమూర్తులు నిర్భీతిగా వ్యవహరిస్తున్నందునే భారత ప్రజాస్వామ్యం సుదృఢంగా ఉందన్నారు. ఇదే సమయంలో కోర్టుల పనితీరులో పెరుగుతున్న టెక్నాలజీ ప్రభావాన్ని కూడా ప్రస్తావించారు. కొవిడ్‌ సమయంలో సాంకేతిక పరిజ్ఞానం గనుక లేకుండా ఉంటే కోర్టులు పనిచేసి ఉండేవి కావన్నారు. టెక్నాలజీ మనకు అసౌకర్యంగా ఉన్నా... దానిని వాడడం ఎంతో ముఖ్యమని చీఫ్‌ జస్టిస్‌ స్పష్టంచేశారు.

నీ ప్రేయసిని ఇస్తావా అని అడిగిన కానిస్టేబుల్‌ తొలగింపు సబబే: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, డిసెంబరు 18: సుద్దులు చెప్పే ‘మోరల్‌ పోలీసింగ్‌’ చేయాల్సిన అవసరం పోలీసు అధికారులకు లేదని సుప్రీంకోర్టు తెలిపింది. నైతిక ప్రవర్తన పేరుతో ఓ జంటను బెదిరించి, అసభ్యంగా ప్రవర్తించిన ఓ కానిస్టేబుల్‌ను ఉద్యోగం నుంచి తొలగించడం సబబేనని పేర్కొంది. ఆయనకు తిరిగి ఉద్యోగం ఇవ్వాలంటూ గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది. గుజరాత్‌లోని 2001లో సీఐఎ్‌సఎఫ్‌ కానిస్టేబుల్‌ సంతోష్‌ కుమార్‌.. రాత్రి ఒంటి గంట సమయంలో మహేశ్‌ అనే వ్యక్తి తనకు కాబోయే భార్యతో బైక్‌పై వస్తుండగా ఆపి రకరకాల ప్రశ్నలు సంధించాడు. అర్ధరాత్రి వస్తుండడాన్ని అవకాశంగా మార్చుకోవాలనుకుని ‘నీ ప్రేయసితో కొద్దిసేపు గడపాలని అనుకుంటున్నాను’ అని మహేశ్‌తో అన్నాడు. దీనిపై మహేశ్‌ మరుసటి రోజే అధికారులకు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన సీఐఎ్‌సఎఫ్‌ అఽధికారులు పాం డేను ఉద్యోగం నుంచి తొలగించారు.

Updated Date - 2022-12-19T11:13:54+05:30 IST