Ooty Hill Train: పట్టాలపై విరిగిపడిన మట్టిచరియలు

ABN , First Publish Date - 2022-12-15T08:22:11+05:30 IST

కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయం- ఊటీ(Mettupalayam- Ooty) నడుమ నడిచే కొండరైలు సర్వీసు బుధవారం రద్దయింది. పట్టాలపై మట్టిపెళ్ళలు,

Ooty Hill Train: పట్టాలపై విరిగిపడిన మట్టిచరియలు

- ఊటీ కొండ రైలు రద్దు

చెన్నై, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయం- ఊటీ(Mettupalayam- Ooty) నడుమ నడిచే కొండరైలు సర్వీసు బుధవారం రద్దయింది. పట్టాలపై మట్టిపెళ్ళలు, బండరాళ్లు విరిగి పడటంతో ఆ రైలు సర్వీసును రద్దు చేసినట్లు సేలం రైల్వే డివిజన్‌ అధికారులు ప్రకటించారు. కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ఉదయం ఊటీ కొండ రైలు బుధవారం ఉదయం మేట్టుపాళయం నుంచి బయలుదేరింది. ఆ రైలు కల్లార్‌ రైల్వేస్టేషన్‌ దాటగానే కల్లార్‌- హిల్‌గ్రోవ్‌ మధ్య పట్టాలపై మట్టిచరియలు, బండరాళ్లు పడి ఉండటాన్ని లోకోపైలట్‌ గమనించి రైలు నిలిపివేశారు. ఆ తర్వాత రైలును వెనక్కి నడుపుతూ మేట్టూపాళయం స్టేషన్‌కు చేర్చాడు. ప్రయాణికులకు టికెట్‌ సొమ్ము వాపసు చేశారు. ఆ తర్వాత రైల్వే సిబ్బంది మట్టిపెళ్లలు విరిగి పడిన ప్రాంతానికి వెళ్ళి మరమ్మతులు ప్రారంభించారు. దీంతో బుధవారం ఊటీ కొండ రైలు సర్వీసును రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. అదే విధంగా ఊటీ నుంచి కూనూర్‌, మేట్టుపాళయం మార్గాల్లోనూ పలు రైళ్లను రద్దు చేశారు.

Updated Date - 2022-12-15T08:22:13+05:30 IST