ధుర్యోధనుడు చిన్న తప్పు కారణంగా భీముని చేతిలో హతమయ్యాడు.... ఆ చిన్న తప్పు ఏమిటో తెలిస్తే...

ABN , First Publish Date - 2022-12-28T12:19:04+05:30 IST

లక్ష్యం పెద్దదైనా, చిన్నదైనా విజయం సాధించే వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. చివరి క్షణంలో చేసే చిన్న పొరపాటు కూడా అంతవరకూ చేసిన కృషిని నాశనం చేస్తుంది. మహాభారతంలో భీముడు

ధుర్యోధనుడు చిన్న తప్పు కారణంగా భీముని చేతిలో హతమయ్యాడు.... ఆ చిన్న తప్పు ఏమిటో తెలిస్తే...

లక్ష్యం పెద్దదైనా, చిన్నదైనా విజయం సాధించే వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. చివరి క్షణంలో చేసే చిన్న పొరపాటు కూడా అంతవరకూ చేసిన కృషిని నాశనం చేస్తుంది. మహాభారతంలో భీముడు మరియు దుర్యోధనుడు మధ్య జరిగిన యుద్ధం నుండి దీనిని మనం అర్థం చేసుకోవచ్చు. దుర్యోధనుడు తాను చేసిన చిన్న పొరపాటు కారణంగా భీముని చేతిలో హతమయ్యాడు. మహాభారత యుద్ధంలో కౌరవ పక్షంలోని గొప్ప యోధులందరూ పాండవుల చేతిలో హతమయ్యారు. యుద్ధంలోని చివరి దశ వచ్చింది.

దుర్యోధనుడి ప్రాణం ప్రమాదంలో పడిందని గాంధారిలో భయం మొదలయ్యింది. దీంతో గాంధారి తనకున్న వరాన్ని వినియోగించాలని భావించి దుర్యోధనుడిని స్నానం చేసి, నగ్నంగా తన ముందుకు రావాలని ఆదేశించింది. గాంధారి తనకు ధృతరాష్ట్రునిడితో వివాహమైన తర్వాత తానుకూడా కళ్లకు గంతలు కట్టుకుంది. గాంధారి తాను ఎప్పుడు కళ్ళు తెరిచి చూసినా ఎదుటనున్న వ్యక్తి శరీరం ఇనుముగా మారిపోయేలా వరం పొందింది. దీంతో గాంధారి దుర్యోధనుడి శరీరాన్ని ఇనుముగా మార్చాలని కోరుతుంది.

తద్వారా అతనిని ఎవరూ చంపలేరని భావించింది. తల్లి ఆజ్ఞను అనుసరించి దుర్యోధనుడు.. నగ్నంగా గాంధారి దగ్గరకు బయలుదేరాడు. దుర్యోధనునికి దారిలో శ్రీకృష్ణుడిని కలిశాడు. శ్రీ కృష్ణుడు దుర్యోధనునితో.. నీవు ఇప్పుడు పెద్దవాడయ్యావు.త ఈ స్థితిలో నీ తల్లి ముందుకు ఇలా వెళ్ళడం మంచిది కాదని చెప్పాడు. కనీసం తొడల మీద అయినా వస్త్రం కప్పుకొని వెళ్లాలని సూచించాడు. దుర్యోధనుడు.. శ్రీకృష్ణుని మాటలు సరైనవని అనుకున్నాడు. తన తొడ భాగాన్ని ఆకులతో కప్పుకున్నాడు. అదే స్థితిలో గాంధారి దగ్గరకు వెళ్లాడు. గాంధారి తన కళ్లకు ఉన్న గంతలను తీసి, దుర్యోధనుడిని చూడగానే అతని శరీరమంతా ఇనుముగా మారిపోయింది. అయితే ఆకులను కప్పుకున్న భాగం మాత్రం సాధారణంగా ఉండిపోయింది.

గాంధారి ఆ ఆకులను చూడగానే దుర్యోధనుడు తప్పు చేశాడని అర్థంచేసుకుంది. యుద్ధం చివరి దశలో భీముడికి, దుర్యోధనుడికి మధ్య గదలతో యుద్ధం జరిగింది. భీముడు తన గదతో దుర్యోధనుడి శరీరంపై దాడి చేశాడు. ఆ సమయంలో శ్రీ కృష్ణుడు... భీమునితో ధుర్యోధనుని తొడపై కొట్టమని సూచించాడు. శ్రీ కృష్ణుడి నుంచి సంకేతం అందిన వెంటనే భీముడు.. దుర్యోధనుడి తొడపై దాడి చేశాడు. ధుర్యోధనుని తొడ భాగం ఇనుముతో కూడి ఉండకపోవడంతో అతను గాయపడి మరణించాడు.

ఈ ఉదంతంతో మనం తెలుసుకోవలసినది ఏమంటే.. మనం ఏ పని చేసినా దానిని సరైన పద్ధతిలో, సరైన నియమాలతో, చేయాలని, చిన్న పొరపాటు చేసినా పెద్ద నష్టం జరుగుతుందని గ్రహించవచ్చు.

Updated Date - 2022-12-28T12:19:06+05:30 IST