ఈ చారిత్రక వైద్యాలయం ఇకపై చరిత్రే

ABN , First Publish Date - 2022-10-28T10:33:09+05:30 IST

‘నిజాం కాలంలో ఆబిడ్స్‌లో నెలవైన ఆధునిక వైద్యాలయాల్లో ఒకటి శాంతాబాయి నర్సింగ్‌ హోం. సుమారు తొమ్మిది దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆస్పత్రి భవనం ఇప్పుడు..

ఈ చారిత్రక వైద్యాలయం ఇకపై చరిత్రే

చరిత్రగా డాక్టర్‌ శాంతాబాయి నర్సింగ్‌ హోం భవనం

నేలమట్టం కానున్న నిజాం కాలం నాటి ఆస్పత్రి

కూల్చివేత పనులు ప్రారంభం

‘నిజాం కాలంలో ఆబిడ్స్‌లో నెలవైన ఆధునిక వైద్యాలయాల్లో ఒకటి శాంతాబాయి నర్సింగ్‌ హోం. సుమారు తొమ్మిది దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆస్పత్రి భవనం ఇప్పుడు కనుమరుగుకానుంది. ఎందరో ప్రముఖులు జన్మించిన చారిత్రక వైద్యాలయం ఇకమీదట చరిత్రగా మిగలనుంది.’

Untitled-2.jpg

మంగళ్‌హాట్‌, అక్టోబర్‌ 27 (ఆంధ్రజ్యోతి): నిజాం కాలంనాటి ప్రముఖ వైద్యుల్లో డాక్టర్‌ కిర్లోస్కర్‌ ఒకరు. ఆయన సోదరి డాక్టర్‌ శాంతా బాయి సాత్వలేకర్‌. ఆమె ఆధ్వర్యంలో ఆబిడ్స్‌లో తాజ్‌మహల్‌ హోటల్‌ ఎదురుగా 1936లో దాదాపు ఐదు వేల గజాల్లో భవనాన్ని నిర్మించారు. నాటి నుంచి శాంతాబాయి నర్సింగ్‌ హోమ్‌ పేరుతో ఆస్పత్రి ప్రారంభమైంది. సున్నపురాయి కట్టడడంతో దాదాపు నాలుగు భవనాల సముదాయంలో వైద్య సేవలను ప్రారంభించారు. అప్పటి నుంచి నగరంలో నివాసం ఉండే ప్రముఖులు, ఇతర ప్రాంతాల్లో నివాసం ఉండే వారు సైతం ఇదే నర్సింగ్‌ హోమ్‌కు వచ్చే వారిని చరిత్రకారులు చెబుతున్నారు. ఇప్పుడు అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్న చాలామంది డాక్టర్‌ శాంతాబాయ్‌ నర్సింగ్‌ హోమ్‌లో జన్మించిన వారని చెప్పుకుంటున్నారు. ఈ ఆస్పత్రిని మాసబ్‌ట్యాంక్‌కు మార్చగా అక్కడ సేవలు కొనసాగిస్తున్నారు. ఈ భవనాన్ని నిర్వాహకులు అమ్మేశారు. దీంతో దాదాపు 86 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ భవనం కూల్చివేత పనులను గురువారం చేపట్టారు. ఈ విషయం తెలిసిన స్థానికులు కొందరు జ్ఞాపకాన్ని పదిలం చేసుకొనేందుకు, భవనం వద్దకు వచ్చి ఫొటోలు దిగారు. ఇలాంటి అరుదైన భవనాలను ప్రభుత్వం పరిరక్షించాల్సిన అవసరం ఉందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2022-10-28T10:57:19+05:30 IST