Eetala Rajender : టీఆర్‌ఎస్‌ ఆరిపోతున్న దీపం

ABN , First Publish Date - 2022-11-08T06:10:41+05:30 IST

టీఆర్‌ఎస్‌ పార్టీ ఆరిపోతున్న దీపం అని, మునుగోడులో కమ్యూనిస్టుల మద్దతు వల్లే ఆ పార్టీ గెలిచిందని ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్‌ అన్నారు. కమ్యూనిస్టుల భిక్ష

 Eetala Rajender : టీఆర్‌ఎస్‌ ఆరిపోతున్న దీపం
Etela Rajender bjp

హైదరాబాద్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ పార్టీ ఆరిపోతున్న దీపం అని, మునుగోడులో కమ్యూనిస్టుల మద్దతు వల్లే ఆ పార్టీ గెలిచిందని ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్‌ అన్నారు. కమ్యూనిస్టుల భిక్షతో గెలిచి.. ‘అధర్మం మీద ధర్మం గెలిచింద’ని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా కోట్లు వెదజల్లే టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ధనస్వామ్యం అంటూ విపక్షాలను విమర్శించడం విడ్డూరంగా ఉందని కేటీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు. జీహెచ్‌ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్‌, మునుగోడులో టీఆర్‌ఎస్‌ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన మాట వాస్తవం కాదా.. గుండెమీద చేయి వేసుకొని చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షాలను తిట్టే కేసీఆర్‌ వారసత్వాన్ని కేటీఆర్‌ పుణికి పుచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. సోమవారం రాష్ట్ర బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈటల మీడియా సమావేశంలో మాట్లాడారు. మునుగోడులో టీఆర్‌ఎస్‌ మద్యాన్ని, డబ్బులను పట్టుకోవద్దంటూ పైనుంచి ఆదేశాలు వచ్చాయని, కింది స్థాయి పోలీసు అధికారులే ఆ విషయాన్ని చెప్పారని ఈటల అన్నారు. పార్టీ ఇచ్చిన డబ్బులు, మద్యాన్ని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఓటర్లకు పంపిణీ చేశారా? లేదా? అన్నది పర్యవేక్షించడానికి ఐదు గ్రామాలకు ఒక ఎస్‌ఐ చొప్పున నియమించారని ఈటల ఆరోపించారు. కొంత మంది పోలీసులు ‘కేసీఆర్‌కు జీతగాళ్లం’ అన్నట్లుగా పనిచేశారని విమర్శించారు.

Updated Date - 2022-11-08T06:10:42+05:30 IST